వెలగపూడిలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్: స్వయంగా వడ్డించి, రుచి చూసిన బాబు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. రూ. 5కే భోజనం, అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా వెలగపూడి గ్రామంలోని తాత్కాలిక సచివాలయంలో ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు పేదలకు దగ్గరుండి భోజనాన్ని తానే స్వయంగా వడ్డించారు. ఆ తర్వాత అదే క్యాంటీన్లో మంత్రులతో కలిసి ఆల్పాహారాన్ని తిని ఆహార నాణ్యతను పరిశీలించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు చినరాజప్ప, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్ ఆల్పాహారాన్ని తిన్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భోజనం ఎంతో బాగుందని చెప్పిన చంద్రబాబు, పేదవాళ్ల ఆకలి తీర్చడంలో ఈ పథకం ఎంతగానో ఉపయోగపడతుందన్నారు. కేవలం దీనిని పైలెట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రారంభిస్తున్నామన్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రాపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేదవాడిని ఆదుకునేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ద్వారా రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి తక్కువ ధరకే భోజనం అందుతుందన్నారు.
300 చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాల ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లలో ఉదయ 7గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యహ్నాం 12 గంటల నుంచి 2 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు భోజనం లభించనుంది. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను ఇస్కాన్ బెంగుళూరుకు చెందిన అక్షయ పాత్రకు అప్పగించారు.
అన్నా క్యాంటీన్లో ధరల వివరాలిలా ఉన్నాయి. కేవలం రూ. 5కే ఉప్మా, సాంబార్ రైస్, పెరుగన్నం, ఇడ్లీ, పొంగల్, పులిహోర ఏదైనా ఒక్క ప్లేట్ అందించనున్నారు. సాంబారు అన్నం ధరను రూ. 7గా నిర్ణయించారు. ఇక రెండు చపాతీలు రూ. 4 మాత్రమే. ప్రతీ రోజూ 500 మందికి అల్పాహారం, భోజనం అందనున్నారు.
అంతక ముందు గుంటూరు జిల్లా వెంకట పాలెంలో సీడ్ యాక్సిస్ హైవేకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని అనుసంధానం చేసే విధంగా ఈ రహదారి నిర్మాణం జరగనుంది. వెంకటాయపాలెం వద్ద నుంచి ఆరు వరుసల రహదారిగా ఈ రోడ్డు నిర్మాణం రాజధాని ప్రాంతం వరకు జరగనుంది.
సుమారు 19.3 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి నిర్మాణానికి రూ.215 కోట్లు కేటాయించారు. ఉద్దండ రాయుని పాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలేనికి కొత్తగా ఈ ఆరు లైన్ల రహదారి రానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎంపీ గల్లా పాల్గోన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రోజు రోజుకు పరిస్థితులు మారుతాయని అన్నారు. 9 నెలల్లో సీడ్ క్యాపిటల్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. అమరావతిలో నిర్మించబోయే 8 ప్రధాన రహాదారులలో ఇది అతి పెద్దదన్నారు. అంతర్జాతీయ కంపెనీలతో నాణ్యమైన రహదారల నిర్మిస్తామని, రాజధాని నిర్మాణ పనులకు స్థానిక ప్రజలు సహకరించాలని చంద్రబాబు అన్నారు.
అంతకుముందు అన్న క్యాంటీన్ను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదవారి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్న క్యాంటీన్లలో రాగి సంకటి అందజేయనున్నట్లు సునీత చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పరిటాల సునీత చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.












Click it and Unblock the Notifications