చంద్రబాబు పోలవరం సందర్శన: సెల్ఫీలు దిగారు
పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అంతకముదు ఆయన పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు పట్టిసీమ ఎడమ కాలువ పనులను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో పలువురు ఇంజనీర్లు సెల్పీలు దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతిపక్షాలు బుద్ధి లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.
దివిస్ సంస్ధ రూ. 500 కోట్లు పెట్టుబడి పెడుతుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని అన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడిలో ఏపీది 15.8 శాతం వాటాగా ఉందని అన్నారు. దసరా నుంచి వెలగపూడి సచివాలయం నుంచే పాలన ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడేది లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని అన్నారు. ప్రతి నెలా మూడో సోమవారం ప్రాజెక్టుని సందర్శిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కలగా చూపించబోమని, వాస్తవ రూపం తీసుకువస్తామని స్పష్టం చేశారు. 2018 నాటికి పోలవరం తొలిదశను పూర్తి చేస్తామని వెల్లడించారు.