నోట్ల రద్దు నాటి పరిణామాలు, రూ.5వేల కోట్లు పంపండి: జైట్లీకి-ఆర్బీఐ గవర్నర్కు బాబు
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి, ఆర్బీఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం నాటి పరిణామాలు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయని చెప్పారు.
ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రూ.5వేల కోట్ల కరెన్సీ రాష్ట్రానికి పంపాలని చెప్పారు. ధాన్యం విక్రయించిన డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలపై నోట్ల కొరత ప్రభావం పడుతోందన్నారు.
డ్రోన్ల పర్యవేక్షణలో అమరావతి పనులు
అమరావతి నిర్మాణ పనులను డ్రోన్లతో పర్యవేక్షించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. డ్రోన్లతో తీసిన ఫోటోలను తనకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చూపించాలన్నారు.
పనుల్లో వేగం పెంచాలని, చేపట్టిన ప్రతి పని నిర్ణిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. గృహనిర్మాణం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో ఎవరైనా విఫలమైతే ఉపేక్షించబోనన్నారు.