లింగమనేని గెస్ట్ హౌస్ వద్ద పడవల్లో 24 గం.లు కాపలా: బాబు భద్రతకు సూచన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరింత భద్రత కల్పించాలని ప్రభుత్వానికి నిఘా విభాగం నుంచి సూచనలు అందినట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రత కల్పించే విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారుల నుంచి ప్రభుత్వానికి లేఖ అందింది.
అందులో చంద్రబాబుకు మరింత భద్రతపై పలు సూచనలు ఉన్నాయి. ఆయన ప్రయాణించే చాపర్, విమానం తదితరాలను ప్రయాణానికి ముందు పూర్తిగా తనిఖీలు చేయాలని ఇంటెలిజెన్స్ సిఫార్సు చేసింది.
ఆయన ఉంటున్న లింగమనేని అతిథి గృహం పక్కనే కృష్ణా నది ఉందని గుర్తు చేస్తూ.. మర పడవల్లో పోలీసులతో 24 గంటలూ కాపలా కాయించాలని, బోట్లలో గజ ఈతగాళ్లు, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉండాలని పేర్కొంది.
కాగా, మంగళవారం నాడు చంద్రబాబు స్వామి వివేకానంద జయంతిలో పాల్గొన్నారు. స్వామి వివేకానందుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. వివేకానందుడి మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం అన్నారు. 2029 నాటికి ఏపీలో అందర్నీ సంతోషంగా, అభివృద్ధిలో ఉంచడమే లక్ష్యమని చెప్పారు.
సింహాద్రి అప్పన్న సేవలో గవర్నర్
గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం విశాఖ జిల్లాలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంతరాలయంలో సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు.
గవర్నర్తో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు రావెల కిషోర్ బాబు, గంటా శ్రీనివాస రావు, పల్లె రఘునాథ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్, మంత్రులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.