జగన్ ఏంటీ చిల్లర రాజకీయం-తల్లి,చెల్లిని కోర్టుకీడ్చడంపై చంద్రబాబు ఫైర్..!
ఏపీలో వైఎస్ కుటుంబ ఆాస్తుల పోరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ఇవాళ దీనిపై స్పందించారు. తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్లు పెట్టే జగన్.. ప్రజలకు ఎలాంటి కండిషన్లు పెడతారో అని సీఎం చంద్రబాబు ఇవాళ వ్యాఖ్యానించారు. నువ్వు మాట్లాడకపోతే ఆస్తి ఇస్తాను, మాట్లాడావు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నానంటూ ఎన్సీఎల్టీలో కేసు వేసే వాళ్లు మనకు కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరిని కంట్రోల్ చేస్తారని చంద్రబాబు అడిగారు. ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని తాను జీవితంలో అనుకోలేదన్నారు. గతంలో రాజకీయ నేతలతో పోరాటం చేసానని, సిద్దాంతం పరంగా, అభివృద్ధి పరంగా పోరాటాలు చేశానని గుర్తుచేసుకున్నారు. విపక్షంలో ఉండగా తాము ఎన్నో పోరాటాలు చేశామని, అందులో తప్పులేదని చంద్రబాబు తెలిపారు. ఇదేంటీ చిల్లర రాజకీయాలని చంద్రబాబు ప్రశ్నించారు.

తండ్రి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా అని విజయమ్మ విషయంలో చంద్రబాబు జగన్ ను ప్రశ్నించారు. 2004లో జగన్ ఆదాయం ఎంత అని, ఆ ఆదాయం ఎక్కడినుంచి వచ్చిందని చంద్రబాబు నిలదీశారు. ఇన్ని లక్షల కోట్లు జగన్ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఇలాంటి వారితో రాజకీయం చేయాలంటే తనకు సిగ్గుగా ఉందన్నారు. వంకర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇకనైనా జగన్ మానుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు.
విలువలు లేని మనుషులు సమాజానికి చేటని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడైనా సాయం చేశారా అని అడిగారు. ఇప్పుడేమో రూ. 10లక్షలు ఇచ్చే శక్తి వచ్చిందా అని అడిగారు. జగన్ దగ్గర ఉన్న డబ్బు ప్రజలకు ఇవ్వాలని, అలా అయినా అవినీతి డబ్బు ప్రజలకు చేరుతుందన్నారు. ఐదేళ్లు ఇంట్లో నుంచి తనను బయటకు రానివ్వలేదని, ఇప్పుడు మీరు తిరుతున్నారుగా అని జగన్ ను అడిగారు. మిమ్మల్ని ఆపాలంటే ఎంత సేపు, ఒక్కనిమిషమని అన్నారు.












Click it and Unblock the Notifications