జగన్ కావాలని దాడి చేయించుకున్నాడనట్లేదు, మీ వాళ్లేనేమో, అందుకే ఫోన్ చేయలేదు: బాబు
అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి తీవ్రంగా స్పందించారు. అమరావతిలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ పైన జరిగిన కోడి కత్తి దాడితో ఏపీ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. జగన్కు సానుభూతి వస్తుందనే తాను దాడి చేశానని స్వయంగా నిందితుడు శ్రీనివాస రావు చెప్పారని అన్నారు. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రాణమని, జగన్ కోసం చేశానని చెబుతున్నారన్నారు. కోడి కత్తి విషయంలో ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదని నవ్వుతూ ఎద్దేవా చేశారు.
అందుకే జగన్కు ఫోన్ చేయలేదు
జగన్ పైన దాడి జరిగగానే గవర్నర్ నరసింహన్ డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మరోవైపు, వైసీపీ, బీజేపీలు తనను ఏ1, డీజీపీ ఏ2 అంటున్నాయని మండిపడ్డారు. తనపై నెపం మోపడం వల్లే తాను జగన్ను పరామర్శించడానికి ఫోన్ చేయలేదని తేల్చి చెప్పారు.
అందుకే కేంద్ర దర్యాఫ్తు అడుగుతున్నారు
కోడి కత్తి దాడి పైన వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని చంద్రబాబు అన్నారు. లేనిది ఉన్నట్లుగా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అందుకే కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. నిందితుడే స్వయంగా సిగ్గులేకుండా సానుభూతి కోసం దాడి చేశానని చెప్పాడని, ఇక తమకు ఏం సంబంధమని అన్నారు.
కేసీఆర్ సహా అందరూ సానుభూతి తెలిపారు
జగన్ పైన దాడి జరిగిన తర్వాత మన పోలీసులు వెళ్లిన తర్వాత నాలుగున్నర గంటల సమయానికి నిందితుడి శ్రీనివాస రావును హ్యాండోవర్ చేశారని చంద్రబాబు చెప్పారు. జగన్ పైన దాడి జరిగిన విషయం తెలియగానే గవర్నర్ సహా కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నర్సింహా రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్లు సానుభూతి తెలిపారన్నారు.
ఒక్కడి మాత్రం చెబుతున్నా.. టీడీపీ పాత్ర లేదు
వైసీపీ, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు అన్నారు. శ్రీనివాస రావు ఎవరెవరితో మాట్లాడారో అన్నీ బయటపెడతామని చెప్పారు. జగన్ కావాలని చేయించుకున్నాడని తాము చెప్పడం లేదని, కానీ నూటికి నూరు శాతం ఇందులో టీడీపీ ప్రమేయం లేదని మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నానని అన్నారు. టీడీపీ ప్రమేయం లేదని, ఉండదని, అలాంటి ఆరోపణలు సరికాదన్నారు.
మీ వాళ్లే నాటకాలు ఆడారేమో
జగన్ దాడి చేయించుకోకపోయినప్పటికీ వాళ్ల వాళ్లే (వైసీపీ) కలిసి నాటకాలు ఆడారేమోనని చంద్రబాబు కొత్త అనుమానం వ్యక్తం చేశారు. ఈ చిన్న విషయాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం పైన బురద జల్లడం వైసీపీకి, ఎన్డీయేకు సరికాదన్నారు. దాడి జరిగిన ఎయిర్ పోర్టు కేంద్రం పరిధిలోనిది అని చెప్పారు. వైసీపీ మాజీ ఎంపీల రాజీనామా అంశం పైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్లాన్ ప్రకారమే రాజీనామా చేశారని, కానీ ఉప ఎన్నికలు వస్తే మనం గెలిచే వాళ్లమన్నారు. మనతో పొత్తు కొనసాగుతుండగానే వైసీపీతో బీజేపీ లాలూచీ పడిందన్నారు.