బెజవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు: వారానికి 2 రోజులు
హైదరాబాద్: ఏప్రిన్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో వారానికి రెండు రోజులు బస చేయనున్నారు. బెజవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎం క్యాంపు ఆఫీస్గా మార్చేందుకు స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించిన పనులను ఫిబ్రవరి మూడో వారం నుంచి మొదలుపెట్టనున్నారు. వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
విజయవాడలో ఉండే రెండు రోజులు అధికారిక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మరో నలుగురు మంత్రులకూ ఇరిగేషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయనున్నారు.
తొలుత క్యాంపు కార్యాలయంగా నిర్ణయించుకున్న స్టేట్ గెస్ట్హౌస్ వాస్తుపరంగా సరిగా లేదన్న భావన నేపథ్యంలో వేరే కొత్త ప్రాంగణం దాని కోసం అన్వేషిస్తున్న అధికారులకు ఇరిగేషన్ కార్యాలయం అనుకూలంగా కనిపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాబు, కృష్ణాడెల్టా సీఈ సుధాకర్లు ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపారు.

దీంతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని అధికారికంగా ఖారారు చేశారు. ఏపీ ప్రభుత్వం దీనిని తెలియజేస్తూ ఇటీవలే ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. దీంతో ఇరిగేషన్ భవనాన్ని మార్పు చేసేందుకు పనులు మొదలయ్యాయి. ‘యూ' ఆకారంలో ఉండే నీటిపారుదలశాఖ భవనంలో ఇప్పటివరకూ రెండంతస్తులు మాత్రమే ఉన్నాయి.
మొదటి అంతస్తులోని నైరుతి భాగాన ఉన్న నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా కార్యాలయాన్ని, దానిపక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాలుతోపాటు ఆ ఫ్లోరులోని అన్ని గదులనూ సీఎం ఆఫీసుకోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉమా కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్లోని మెట్లకు ఎడమవైపున ఏర్పాటు చేస్తున్నారు.
ఇక కుడివైపునున్న ఐదు గదులను మిగతా మంత్రులకోసం కేటాయించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఎడమ వైపున చివర్లో ఉన్న జాతీయ జల రవాణా కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి వేరేచోటకి పంపే ఆలోచనలో ఉన్నారు.
ఇప్పటికే భవనం పైనున్న ‘ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల-ఆయకట్టు అభివృద్ధి శాఖ' బోర్డును తొలగించారు. కలెక్టర్ బాబు ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆర్ అండ్ బీ, ప్రణాళిక శాఖల అధికారులతో సమావేశమై సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు.












Click it and Unblock the Notifications