ఆఫీసర్లలా.. తప్పుచేస్తే అంతే, ఒకరిద్దర్ని వదిలేస్తా!: మంత్రులకి బాబు షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సొంత పార్టీ నేతలకు, మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. టిడిఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రుల పని తీరు పైన చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆఫీసర్లలా పని చేస్తున్నారు: మంత్రులపై బాబు
మంత్రులు అధికారుల వలె పని చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు పార్టీలు, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం లేదన్నారు. 2019 వరకు శాసన మండలిలో మనం బలం పెరగాల్సి ఉందని బాబు చెప్పారు.
ఇతర పార్టీల నుంచి వస్తే పోటీ కాదు, ఇబ్బంది పెట్టొద్దు
ఇతర పార్టీల నుంచి వచ్చే వారు మనకు పోటీ అని ఎవరూ అనుకోవద్దన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి ఉంటుందని, ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
జిల్లాల్లో ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రులకు బాబు సూచించారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తల పనులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రులను హెచ్చరించారు. అవినీతి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఒకరి వల్ల నష్టం జరిగితే ఊరుకునేది లేదు
ఎవరో ఒకరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరిగితే తాను ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. అవసరమైతే ఒకరిద్దర్ని వదులుకోవడానికి సిద్ధమని అంతకుముందు బాబు చెప్పారు. తద్వారా... అవినీతికి పాల్పడినా, అలసత్వం వహించనా ఉద్వాసన తప్పదని చంద్రబాబు మంత్రులకు హెచ్చరించారని చెప్పవచ్చు.
రాజకీయంగా పొరపాటు చేస్తే తాను సరిదిద్దే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో వ్యక్తిగతంగా తప్పులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని చెప్పారు. ప్రతి సోమవారం మంత్రులు, అధికారులు అమరావతిలో అందుబాటులో ఉండాలని చెప్పారు.