టార్గెట్ 2024 : జగన్ తొలి సంతకంలో ఎన్నో విషయాలు: 60 ఏళ్లకే పెన్షన్..!
Recommended Video
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అప్పుడే టార్గెట్-2024 లక్ష్యంగా అడగులు వేస్తున్నారు. తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు పెన్షన్ను మూడు వేల వరకు పెంచే నిర్ణయానికి తొలి అడుగు వేసారు. ఈ జూన్ నుండి 2,250 పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. పెన్షన్ వయసును 65ఏళ్ల నుంచి 60 ఏళ్ళకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నిర్ణయంతో కొత్తగా 5.49 లక్షల మందికి అదనంగా ప్రయోజనం కలగనుంది.
మరో రెండు కీలక అంశాలు..
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి సంతకం పెన్షన్ల పెంపుకు ఆమోదం తెలుపుతూ చేసారు. అయితే, అందులోనే అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. పింఛను రూపేణా రూ.2వేలు పొందుతున్న వారికి ఆ మొత్తాన్ని రూ.2,250కి పెంచుతూ వైఎస్సార్ పింఛను పథకం కింద ఇకపై ఈ సాయం లభిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ సంతకం చేసిన వాటిలో వైకల్య శాతంతో సంబంధం లేకుండా దివ్యాంగులు అందరికీ రూ.3వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల చొప్పున సాయాన్ని అందించే విధంగా నిర్ణయించారు. అంతేకాక వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేఇంది.
12 రకాల ఫించన్లు..కొత్తగా 5.49 లక్షల మందికి
కొత్త ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న లబ్ది దారుల సంఖ్య 54.10 లక్షలు కాగా,వారి సంఖ్య 5.49 లక్షలకు పెరగనుంది. ఏపీలో ప్రస్తుతం 12 రకాల ఫించన్లు అమల్లో ఉన్నాయి. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. డప్పు కళాకారులు, హిజ్రాలకు రూ.3వేల చొప్పున ఇస్తోంది. ధ్రువీకరణ పత్రం ఆధారంగా 80శాతం వైకల్యమున్న వారికి రూ. 3వేలు, 40 శాతం నుంచి 79శాతం వైకల్యమున్న వారికి రూ.2వేల చొప్పున సాయం అందిస్తోంది. డయాలసిస్ రోగులకు రూ.3,500 చొప్పున ఇస్తోంది. తాజాగా సీఎం నిర్ణయంతో రూ.2వేల సాయం పొందుతున్న వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలకు ఇకపై ప్రతినెలా రూ.2,250 చొప్పున అందనుంది. వీరితో పాటు 40 శాతం నుంచి 79 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సైతం రూ.3వేల సాయం వర్తించనుంది.
టార్గెట్ 2024 అడుగులు..
2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్..అప్పుడే టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీఎల్పీ నేతగా ఎన్నికైన సమయంలోనే జగన్ తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఈ ఎన్నికల్లో గెలిచి మన సమర్ధత చాటుకొని 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. తన పాలనలోనూ ఇదే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజలను ఆకట్టుకొనేందుకు గ్రామ సచివాలయాలు.. గ్రామ వాలంటీర్ల ఏర్పాటు..పెన్షన్ల పెంపుకు ప్రాధాన్యత..ఎన్నికల హామీల అమలు మొదలు పెట్టటం ద్వారా ప్రజల్లో తన విశ్వసనీయత పెంచుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక, పాలనా పరంగానూ కొత్త నిర్ణయాలతో తటస్థ..మధ్య తరగతి ప్రజలను తన వైపు తిప్పుకొనే వ్యూహాలకు పదును పెడుతున్నారు.