కుప్పంలో వైఎస్ జగన్ ఒకే 'ఒక్క అడుగు'
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఛత్రపతి. ఈ సినిమాలో ఒక డైలాగ్ అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతినాయకుడి దగ్గరకు వెళ్లిన కథానాయకుడు ఒకే ఒక్క అడుగు అడుగుతున్నానంటూ మ్యాప్ మీద తన పాదాన్ని ఉంచుతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అచ్చం అలాగే కుప్పం కావాలంటున్నారని వైసీపీ శ్రేణులు వెల్లడించాయి.
తొలిసారిగా అడుగు పెడుతున్న జగన్
ఒక్క కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకుంటే యావత్ రాష్ట్రం వైసీపీ పరమవుతుందని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీని, నేతలను మానసికంగా బలహీనపరచడానికి ఈనెల 22వ తేదీన తొలిసారిగా కుప్పంలో పర్యటించబోతున్నారు. ఒకే ఒక్క అడుగు కుప్పంలో పెడుతున్నారు. ఇంతవరకు జగన్ ఇక్కడ పర్యటించకపోవడం గమనార్హం. ఓదార్పు పేరుతో పాదయాత్ర చేసినప్పుడు కూడా కుప్పం వెళ్లలేదు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ
జగన్ తొలిసారిగా ఇక్కడ పర్యటిస్తుండటంతో భారీగా జనసమీకరణ చేసి ప్రజాదరణ ఎలా ఉందో ప్రతిపక్ష నేతకు చూపిద్దామనే పట్టుదలతో వైసీపీ నాయకులున్నారు. ఇటీవలే చంద్రబాబు కుప్పంలో మూడురోజులు పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ-వైసీపీ మధ్య జరిగిన వివాదం, అన్న క్యాంటిన్ గొడవ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు 60 మంది జైళ్లలో ఉన్నారు. వీరికి బెయిల్ కూడా లభించలేదు.
రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు
కుప్పం పురపాలక సంఘంలో రూ.66 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ ఈనెల 22వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి అక్కడ పర్యటించే సమయంలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొనాలి. కానీ ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి ఎమ్మెల్యే అవడంతో ఆయన పాల్గొనే అవకాశం లేదు.
సీఎం రాకకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక్కడి నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ భరత్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం బాధ్యతలను జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు కూడా ఇక్కడి వ్యవహారాలను చూస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానికంగా బలమైన టీడీపీ నాయకులను వైసీపీలోకి చేర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.