గవర్నర్తో జగన్ భేటీ.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్.. నూతన మంత్రుల జాబితా రెడీ!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 11న కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశమైయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై గవర్నర్తో చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అటు తన డిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలను బిశ్వభూషన్కు జగన్ వివరించారు.
ఈనెల 11న ఏపీ కేబినెట్ విస్తరణ
ఏపీ కేబినెట్ విస్తరణ ఈనెల 11న ఉదయం 11.30 గంటలకు టైమ్ ఫీక్స్ అయింది. సచివాలయం భవన సముదాయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈమేరకు గవర్నర్తో భేటీ అయిన సీఎం జగన్ మంత్రివర్గ పునర్ వ్వవస్థీకరణపై చర్చించారు.
కేబినెట్ విస్తరణ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న మంత్రులందరితో రాజీనామాలు తీసుకునే అంశాన్ని కూడా వివరించారు. ఈనెల 11న కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి గవర్నర్ను జగన్ ఆహ్వానించారు. నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.
ఏపీ మంత్రివర్గం చివరి భేటీ..
మరోవైపు తన ఢిల్లీ పర్యటన వివరాలను కూడా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కు వివరించినట్లు సమాచారం. పాలనా వికేంద్రీకరణ దృష్ట్యా నూతన జిల్లాల ఏర్పాటుపై కూడా గవర్నర్తో చర్చించారు. నూతన మంత్రుల జాబితాను రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథాకాలపై వివరించారు. గురువారం సాయంత్రం 3 గంటలకు చివరిసారిగా ప్రస్తుత కేబినెట్ సమావేశం కానుంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురితో మినహా మిగతా మంత్రులందరితో రాజీనామాలు చేయిస్తారని సమాచారం.
నూతన మంత్రుల జాబితా సిద్ధం!
అటు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలపగానే ఆదేరోజు కొత్తగా కేబినెట్లోకి వచ్చే వారికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో బెర్త్ కోసం వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ వద్దకు క్యూ కడుతున్నారు. అయితే తమ కేబినెట్ కూర్పుపై ఇప్పటికే జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తొలగించబడిన మంత్రులు పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి ఉంటుందని సీఎం ఇప్పటికే వారికి తేల్చిచెప్పారు. కేబినెట్ విస్తరణ పూర్తిగా జగన్ అభిష్టం మేరకే అని సీనియర్ మంత్రులు బయటకి చెబుతున్నా.. లోలోన మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. అటు కొత్తగా మంత్రి వర్గంలో చోటుపై ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.