ఏపీలో పాత రేషన్ కార్డు దారులకు ఊరట- వెయ్యి రూపాయలు ఇవ్వాలని జగన్ ఆదేశం..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత రేషన్ కార్డు దారులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం బియ్యం కార్డు దారులకు ఇస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని పాత రేషన్ కార్డు దారులకూ వర్తింప చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
పాత రేషన్ కార్డు దారులకూ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల స్ధానంలో ప్రత్యేక అవసరాల కార్డులను తీసుకొచ్చింది. ఇందులో బియ్యం తో పాటు రేషన్ సరుకులు మాత్రమే అవసరమైన పేదలకు బియ్యం కార్డులను, పింఛన్లు మాత్రమే కోరుకునే పేదలకు పెన్షన్ కార్డులు తీసుకొచ్చింది. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పేదలకు వెయ్యి రూపాయల సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం బియ్యం కార్డు దారులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం దాన్ని పాత రేషన్ కార్డు దారులకూ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అభ్యర్ధనల మేరకే...

వెయ్యి రూపాయల కరోనా సాయాన్ని బియ్యం కార్డు దారులకే అందిస్తే గతంలో రేషన్ కార్డులు కలిగిన తమ పరిస్ధితి ఏంటని పేదలు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ మేరకు వచ్చిన అభ్యర్ధనలపై స్పందించిన ప్రభుత్వం.. పాత రేషన్ కార్డు దారులకూ వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర్రంలో సచివాలయాల వద్ద వెయ్యి రూపాయల కోసం ఎదురుచూస్తున్న పాత రేషన్ కార్ఢుదారుల కష్టాలు తీరనున్నాయి.
కరోనా సమయంలో ఎవరూ పస్తులుండకూడదని సీఎం జగన్ అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.












Click it and Unblock the Notifications