ఏపీలో కరోనా: జగన్ కీలక నిర్ణయాలు.. ఫ్రంట్లైన్ సిబ్బందికి బీమా.. డ్వాక్రా తయారీ మాస్క్లు..
దేశంలో కరోనా వైరస్ మోస్ట్ ఎఫెక్టెడ్ టాప్-10 రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ.. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఒకింత ఊరట కలిగించే అంశం. ఆదివారం నాటికి కేసుల సంఖ్య 647కు చేరగా, అందులో కోలుకున్నవాళ్ల సంఖ్య 65కు పెరిగింది. ఇప్పటిదాకా 17 మంది చనిపోయారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అందరికీ బీమా..
కరోనాపై పోరులో ప్రాణాలకు తెగించిమరీ ఫ్రంట్ లైన్ లో పనిచేస్తోన్న సిబ్బంది అందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామవాలంటీర్లు, ఆశా వర్కర్లుతోపాటు గ్రామ సచివాలయ సిబ్బందిని వెంటనే బీమా పరిధిలోకి తేవాలని సూచించారు. అలాగే, వైద్య సిబ్బంది, సహాయక సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన రక్షణ సదుపాయాల విషయంలో లోటు రానియొద్దని చెప్పారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

ఆ నాలుగు జిల్లాలపై..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, హెల్త్ మినిస్ట్రీ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు పలువురు కీలక అధికారులు సీఎం రివ్యూ మీటింగ్ కు హాజరయ్యారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి, కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న నాలుగు జిల్లాలు(కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు)పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని జగన్ ఆదేశించారు. అక్కడి కంటైన్ మెంట్ జోన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, టెస్టింగ్ ప్రక్రియ పక్కాగా కొనసాగించాలన్నారు. సౌత్ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి వచ్చినందున వేగం పెంచాలన్నారు.

ఏపీ టాప్..
కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ సర్కారు తీరు బాగుందంటూ కేంద్రం అభినందించిన దరిమిలా రాష్ట్రం సాధించిన మరిన్ని ఘనతల్ని అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి 10 లక్షల జనాభాలో ఎక్కువ మందికి టెస్టులు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, శనివారం ఒక్కరోజే 5400 టెస్టులు చేపట్టామని, ఇంటింటి సర్వేల ద్వారా గుర్తించిన మరో 32 వేల మందికి కూడా టెస్టుల నిర్వహణను వేగిరం చేశామని అధికారులు వివరించారు.

ఒక్కొక్కరికి మూడు మాస్కులు..
ఏపీలో ప్రతి ఒక్క వ్యక్తికి కనీసం మూడు మాస్కులు అందిస్తామన్న సీఎం జగన్ ప్రకటన మేరకు.. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున మాస్కుల ఉత్పత్తిని చేపట్టారు. తొలి దఫా మాస్కులను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. మొత్తం 16 కోట్ల మాస్కులనూ డ్వాక్రా సంఘాలతోన తయారు చేయించాలని, తద్వారా లాక్ డౌన్ వేళలోనూ మహిళలకు పని కల్పించినట్లవుతుందని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మాస్కుల తయారీకి అవసరమైన క్లాత్ ను కూడా ప్రభుత్వమే ఆప్కో నుంచి సమకూర్చుతున్నది.












Click it and Unblock the Notifications