కరోనా లాక్డౌన్: జగన్ డేరింగ్ స్టెప్.. మోదీ స్ట్రాటజీ కూడా ఇదేనా? కేసీఆర్ దారెటు?
కరోనా వైరస్ మనతో మరింత కాలం ఉండబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసిన దరిమిలా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై దృష్టిసారించాయి. నిజానికి లాక్ డౌన్ అనేది యుద్ధసన్నాహక గడువేగానీ అంతిమ పరిష్కారం కాదని అందరికీ తెలిసిందే. రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కోనేలా వ్యవస్థల్ని సిద్ధం చేయడానికి లాక్ డౌన్ గడువు పనికొస్తుంది. గడిచిన నెల రోజుల్లో ఇండియాతోపాటు మిగతా దేశాలూ అదే పని చేశాయి. మరింత కాలం లాక్ డౌన్ పొడగించుకుంటూ పోయేకంటే, మెరుగైన విధానాలనే ఆయుధాలతో దాన్ని ఎదుర్కోవడం ఉత్తమ మార్గమనే వాదన బలంగా తయారైంది. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కీలకంగా మారింది.

మోదీ మనసెరిగి..
ప్రధానితో ఇంటరాక్షన్ తర్వాత ఏపీ సీఎం వైస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు, ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు. కరోనాపై సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన.. ఏపీలో మే 3 తర్వాత గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తామని తెలిపారు. మే 3 తర్వాత లాక్ డౌన్ సడలింపులకు కేంద్రం కూడా సుముఖంగా ఉందని, ఎకనానమీ రీస్టార్ట్ చేసేందుకే మోడీ మొగ్గుచూపుతున్నారని జాతీయ మీడియాలో రిపోర్టులు వస్తున్నవేళ.. ప్రధాని సానుకూలంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే జగన్ తన ఆలోచనల్ని డేరింగ్గా బహిర్గతం చేశారని తెలుస్తోంది.

అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు జగన్..
కరోనా లాక్ డౌన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ ప్రధాని మోదీ పనిని ఈజీ చేశారనే భావన వ్యక్తమవుతున్నది. గతంలో లాక్ డౌన్ పొడగింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగానే చేసిన ప్రకటనపై దేశవ్యాప్త చర్చ జరగడం, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ వ్యక్తపర్చడం, చివరికి మోడీనే లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్ ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు ఎగ్జిట్ స్ట్రాటజీ విషయంలో ఏపీ సీఎం జగన్ అందరికంటే ముందు ప్రకటన చేశారు. దీనిపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది. మోదీ స్ట్రాటజీ కూడా ఇదే అయి ఉండొచ్చనే భావన వ్యక్తమవుతోంది.

రెడ్ సిగ్నల్.. గ్రీన్ సిగ్నల్..
ఓ వైపు కొవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, మే 3 తర్వాత గ్రీన్ జోన్లలో మాత్రమే సడలింపులు కల్పిస్తారని, ఆరెంజ్ జోన్లలో పాక్షిక సడలింపులు ఉంటాయంటూ జాతీయ మీడియాలో రిపోర్టు వచ్చాయి. ప్రధానితో భేటీలోనూ మెజార్టీ సీఎంలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలసింది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా బయటికి వెల్లడించింది మాత్రం ఏపీ సీఎం జగన్ ఒక్కరే. రెడ్ జోన్లలో సడలింపులు ఉండబోవన్న ఆయన.. గ్రీన్ జోన్లలో మాత్రం జనజీవనం, ఎకానమీ ఆపరేషన్స్ తిరిగి సాధారణ స్థాయికి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
Recommended Video

మిగతావాళ్ల మాటేంటి?
ప్రధానితో భేటీలో ఆరు గురు ముఖ్యమంత్రులు మాత్రమే లాక్ డౌన్ పొడగింపునకు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. మే 3 తర్వాత స్ట్రాటజీపై తీరా కేంద్రం ప్రకటన చేసిన తర్వాత ఏవైనా రాష్ట్రాలు విరుద్ధంగా వెళ్లే అవకాశాలూ లేకపోలేవు. కాబట్టి, అందరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్నే మోదీ అనుసరించే వీలుంది. ముందుగా కేంద్రం ఆలోచనను అనుకూల సీఎంల ద్వారా వెల్లడించి, ఆ తర్వాత అవే అంశాలను అధికారికంగా ప్రకటించడం గతంలనూ జరిగింది. సో, ఏపీ సీఎం తాజా ప్రకటనే కేంద్రం స్ట్రాటజీ అయినా ఆశ్చర్యపోనవసరంలేదు. అయితే అధికారిక ప్రకటనలు వెలువడేదాకా దేన్నీ నమ్మే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications