ఏపీ సీఎం జగన్ లండన్ వెళ్లింది అందుకే!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. సీబీఐ కోర్టు కేవలం దావోస్ వెళ్లడానికే జగన్ కు అనుమతిచ్చిందని, లండన్ వెళ్లేందుకు అనుమతివ్వలేదని, ఒకవేళ లండన్ వెళ్లడానికి అనుమతిస్తే అధికారిక పర్యటనలో ఎందుకు చేర్చలేదని యనమల ప్రశ్నించారు. ఒకవేళ సీబీఐ కోర్టు అనుమతివ్వకపోయినా జగన్ లండన్ వెళితే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, డబ్బులు దాచుకోవడానికే ఆయన లండన్ వెళ్లారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. సొంత పనులకు, రహస్య పనులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడురోజుల పర్యటన కోసం ప్రత్యేక విమానంలో సతీసమేతంగా బయలుదేరారు. అయితే అధికారులు దావోస్ వెళ్లారుకానీ ముఖ్యమంత్రి దంపతులు లండన్ వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీబీ ఐ కోర్టు దావస్ వెళ్లడం వరకే అనుమతిచ్చిందికానీ లండన్ వెళ్లడానికి కాదుకదా అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. లండన్ వెళ్లడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకుంటే ఎందుకు వెల్లడించలేదని, డబ్బులు దాచిపెట్టుకోవడానికి లండన్ వెళ్లారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రస్తుతం లండన్ లోనే ఉన్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలకు జగన్ హాజరవుతారా? లేదా? అనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ప్రకారం దావోస్ చేరుకోకుండా లండన్ చేరుకోవడమనేది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని, ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.