మళ్లీ వచ్చేస్తున్న "కన్నప్ప".. ఈసారైనా చూసేనా ???
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన 'కన్నప్ప' మళ్లీ థియేటర్లకు రానుంది. 2025 జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించారు. పరమ శివ భక్తుడు తిన్నడు జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించారు. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.
కాగా మూవీలో భారీ తారాగణం ఉండడంతో విడుదల సమయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రారంభ వసూళ్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఫైనల్ రన్లో సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. అయితే ఇప్పుడు రీ-రిలీజ్లు ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ట్రెండ్గా మారాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 2026 జూన్ 27న రీ-రిలీజ్ అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. 'ఆ దివ్య ప్రయాణం మళ్లీ వెండితెరపైకి వస్తోంది' అని పేర్కొంది. థియేటర్ అనుభూతిలో ఈ సినిమాను చూడాలనుకున్న ప్రేక్షకులకు ఇది మరో అవకాశం అని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ప్రత్యేక పాత్రను పెద్ద తెరపై మళ్లీ చూడాలనుకునే అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అయితే 'కన్నప్ప'పై మొదటిసారి రాని బజ్.. రెండోసారి మాత్రం వస్తుందా అని ఒక వర్గం ప్రేక్షకుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
తిన్నడు నుంచి కన్నప్పగా మారిన ప్రయాణం..
సినిమా కథలో తిన్నడు అనే గిరిజన యువకుడి భావోద్వేగ ప్రయాణమే ప్రధానాంశం. చిన్ననాడే తల్లిని కోల్పోయిన అతడు, కొన్ని సంఘటనల కారణంగా దేవుడిపై నమ్మకం కోల్పోతాడు. విలువిద్యలో నైపుణ్యం కలిగిన తిన్నడు, తర్వాత శివభక్తుడైన కన్నప్పగా ఎలా మారాడన్నదే కథకు హృదయం. ఈ మూవీ షూటింగ్లో అధిక భాగం న్యూజిలాండ్లో జరిగింది. భారీ నిర్మాణ విలువలు, పౌరాణిక నేపథ్యం, పాన్ ఇండియా నటీనటులు ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.












Click it and Unblock the Notifications