వీడియో: జగన్ జేబులో నుంచి పెన్ లాక్కున్న చిన్నారి: అధికారం అంటే ప్రజలపై మమకారం: చేతల్లో
అమలాపురం: గోదావరికి ఇటీవల సంభవించిన వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తోన్నారు. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతోంది. బాధితులను స్వయంగా కలుస్తోన్నారు. నేరుగా వారితో మాట్లాడుతున్నారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటోన్నారు. నీట మునిగిన పంట పొలాలను తిలకించారు. బాధితులకు ధైర్యాన్ని ఇస్తోన్నారు.
పంట్పై ప్రయాణం..
ఈ తాడేపల్లి నుంచి నేరుగా కోనసీమ జిల్లాలోని గంటి పెదపూడికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు వైఎస్ జగన్. అనంతరం వశిష్ఠ గోదావరి నదిలో పంట్పై ప్రయాణం చేశారు. లంక గ్రామాలకు చేరుకున్నారు. అనంతరం ట్రాక్టర్ పీ గన్నవరం మండలంలోని పుచ్చకాయల వారి పేట, ఉడిముడి లంక, బూరుగులంక, అరిగిల వారి పేటల్లో పర్యటించారు. రోడ్డు మార్గంలేని కొన్ని ప్రాంతాల్లో కాలి నడకన బయలుదేరి వెళ్లారు. బాధితులను కలుసుకున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.
బాధితులతో నేరుగా..
ఆయన పర్యటన కొనసాగుతున్న సమయంలో వర్షం కురిసింది. దాన్ని లెక్క చేయలేదాయన. వర్షంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్య పడొద్దని అన్నారు. వరద సమయంలో తాను అక్కడికి వచ్చివుంటే అధికార యంత్రాంగానికి ఆటంకం కలిగివుండేదని వివరించారు. తమ పనులను వదిలిపెట్టి అధికారులందరూ తన చుట్టూ తిరిగేవారని చెప్పారు. అధికారులకు వారం రోజులపాటు గడువు ఇచ్చిన తరువాతే తాను వచ్చానని పేర్కొన్నారు.
ఆసక్తికర ఘటన..
ఆయన పర్యటనలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పుచ్చకాయలవారి పేటలో వరద బాధితురాలు నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో ఆమె కుమారుడిని వైఎస్ జగన్ ఎత్తుకున్నారు. ఆ బాలుడిని ఎత్తుకునే బాధితులతో మాట్లాడారు. అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు. అదే సమయంలో ఆ చిన్నారి వైఎస్ జగన్ షర్ట్ జేబులో ఉన్న పెన్ను తీసుకునే ప్రయత్నం చేశాడు. రెండు చేతులతో పెన్ను పైకి లాగాడు. అది కింద పడింది.
పెన్ కావాల్నా..
దీనితో నక్కా విజయలక్ష్మి ఆ పెన్ను తీసి వైఎస్ జగన్ భద్రత సిబ్బందికి అందించారు. వైఎస్ జగన్ ఆ పెన్ను తీసుకుని మళ్లీ ఆ చిన్నారికే ఇచ్చారు. పెన్ కావాల్నా నీకు.. ఇందో తీసుకో అంటూ ఆ చిన్నారికి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారం అంటే ప్రజలపై ఆజమాయిషీ చేయడం కాదని.. వారిపై మమకారాన్ని చాటడమేనంటూ వైఎస్ జగన్ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తోన్నారు.