Viral Video: ప్రకృతి ఉగ్రరూపం, మూడు విమానాలు ధ్వంసం!
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) ఆదివారం సాయంత్రం ఒక ఊహించని ప్రకృతి విలయానికి వేదికైంది. అప్పటివరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకుని, ఊహకందని వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం రన్వేపై పెను అలజడిని సృష్టించాయి. ఈ వాతావరణ బీభత్సానికి టెర్మినల్-2 (T2) వద్ద పార్క్ చేసి ఉన్న ఎయిర్ ఇండియాకు చెందిన మూడు భారీ విమానాలు తీవ్రంగా దెబ్బతినడం విమానయాన రంగంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి నెటిజన్లను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రకృతి సృష్టించిన గాలికోలాహలానికి రన్వేపై ఉన్న గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు అదుపు తప్పి కాగితపు ముక్కల్లా కొట్టుకుపోయాయి. వైరల్ వీడియోలో.. ఎయిర్ ఇండియా విమానం వైపు నెక్స్ట్ లెవల్ వేగంతో దూసుకొచ్చిన 'ఇండిగో’ సంస్థకు చెందిన ప్రయాణీకుల నిచ్చెన (స్టెప్లాడర్), నిలకడగా ఉన్న విమానాన్ని బలంగా ఢీకొట్టడం స్పష్టంగా కనిపించింది. గాలుల ధాటికి స్థానభ్రంశం చెందిన ఈ భారీ ఇనుప పరికరాలు క్షిపణుల్లా దూసుకుపోవడంతోనే విమానాలకు భారీ నష్టం వాటిల్లింది.

ఏటీసీ వైఫల్యమా? ముందస్తు సిగ్నల్స్ ఏవి?
ఈ పెను ప్రమాదం వెనుక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వైఫల్యం ఉందా? అన్న కోణంలో చర్చ మొదలైంది. సాయంత్రం 4:40 గంటల సమయంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) అధికారులు ధృవీకరించారు. అయితే, వాతావరణ పరిస్థితులు అంత ఘోరంగా క్షీణించే ముందు ఏటీసీ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేటర్కు గానీ, విమానయాన సంస్థలకు గానీ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు (Alerts) జారీ కాకపోవడం గమనార్హం. ఒకవేళ ముందే సమాచారం ఉండి ఉంటే రన్వే పరికరాలను లాక్ చేసి, ఈ భారీ నష్టాన్ని నివారించేవారమని అధికారులు వాపోతున్నారు.
HEART STOPPING MOMENT AT DELHI AIRPORT T2.
— Rahul Shivshankar (@RShivshankar) June 8, 2026
FIRST FOOTAGE.
3 Air India aircraft parked at Delhi Airport’s Terminal 2 were damaged after ground equipment broke loose during a sudden storm and slammed into the planes. Sources claim no prior ATC weather warning was issued to airlines… pic.twitter.com/c8Y9pl9RX9
రంగంలోకి ఇంజనీర్లు.. తనిఖీలు ముమ్మరం
ప్రస్తుతం దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలను అత్యవసరంగా రన్వే నుంచి తొలగించి, సాంకేతిక పరిశీలన కోసం సర్వీసులను నిలిపివేశారు. విమాన రెక్కలు, బాడీ భాగాలకు తగిలిన దెబ్బలను ఇంజనీర్ల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. వీటిలో రెండు విమానాలు స్వల్ప నష్టంతో బయటపడటంతో త్వరలోనే తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, మూడో విమానానికి మాత్రం గట్టిగానే దెబ్బ తగిలిందని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థల సర్వీసులు కూడా ఈ తుఫాను గాలికి ప్రభావితమవడంతో, ఎయిర్పోర్ట్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి వ్యవస్థను పునరుద్ధరించే పనిలో పడ్డారు.













Click it and Unblock the Notifications