ఏపీలో మరో పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్: ఉచిత పంట బీమా, ఒక పద్ధతిలో..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ పరిస్థితుల కారణంగా సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు నాంది పలికింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
Recommended Video
రైతుల ఖాతాల్లోకి రూ. 1252 కోట్లు
గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ. రూ. 1252 కోట్లను జమ చేయనున్నారు. 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతుల వాటాను కూడా సర్కారే భరిస్తోంది: వైఎస్ జగన్
సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమల్లో భాగంగా రైతుల వాటాను కూడా సర్కారే భరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు.
రైతుల్లో ఆ నమ్మకం కలగాలి..
పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో 10.641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని, వాటన్నింటినీ గ్రామ సచివాలయాలతో అనుసంధానించామని తెలిపారు. ఆర్బీకే పరిధిలోని ఈ క్రాపింగ్ డేటా ఆధారంగా పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్నామని సీఎం తెలిపారు.
పంట నష్టాన్ని ఇలా తెలుసుకుంటోంది..
కాగా, ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ క్రాప్లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేగాక, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. 2019-20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప జేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ. 468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ. 971.23 కోట్లు చెల్లించింది. ఈ పథకం ప్రారంభించిన వైఎస్ జగన్ సర్కారు రైతుల పక్షపాతి అని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.