అమిత్ షా తో ముగిసిన సీఎం వైఎస్ జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే!!
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. రెండవ రోజు కూడా వరుస భేటీలతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన జగన్ అమిత్ షా తో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక చర్చలు జరిపారు.
అమిత్ షా తో జగన్ కీలక భేటీ
గురువారం సాయంత్రం ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో జగన్ భేటీ అయ్యారు. ఆపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయిన జగన్ మోహన్ రెడ్డి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించిన జగన్ రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.
కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధులిచ్చి సహకరించాలని కోరిన జగన్
అలాగే జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణను కోరుతూ దీని పై అమిత్ షా కు నివేదికను అందజేశారు. పోలవరం నిధులపై చర్చించిన జగన్ కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిచ్చి సహకరించాలని కోరారు. కొత్త మెడికల్ కళాశాలలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు పైన జగన్ మోహన్ రెడ్డి హోం శాఖ మంత్రితో చర్చలు జరిపారు.
ఏపీ పెండింగ్ సమస్యలపైనే కాదు.. రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చ
ఏపీ పెండింగ్ సమస్యలపైన ప్రధానంగా చర్చలు జరిపాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు పైన జగన్ మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలతో చర్చించారని అధికారిక వర్గాలు చెబుతున్నా, జగన్ పర్యటన వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అన్న చర్చ జోరుగా సాగుతుంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల పైన కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇక రాష్ట్రపతి ఎన్నికలలో గెలవడం కోసం బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం అవసరం ఉన్న నేపథ్యంలో దీనిపై ఇద్దరు నేతలు చర్చించారు అని అంటున్నారు.
Recommended Video
ఏపీలో పొత్తుల రాజకీయాలు.. అమిత్ షా తో జగన్ భేటీపై ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలపైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి, అమిత్ షా కు మధ్య చర్చలు జరిగాయని భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో భవిష్యత్తు ఎన్నికల పొత్తులపైనా చర్చలు జోరుగా సాగుతున్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ కావడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.