హర్యానా సీఎం ఖట్టర్ తో జగన్ భేటీ-వైజాగ్ రిసార్ట్స్ లో ఏకాంత చర్చలు-సర్వత్రా ఆసక్తి
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో వైజాగ్ లో భేటీ అయ్యారు. రుషికొండలోని పెమా వెల్ నెస్ రిసార్ట్స్ లో సాగిన వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పైకి ప్రభుత్వ వర్గాలు మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్తున్నా అంతకు మించిన చర్చలే వీరిద్దరి మధ్య సాగినట్లు తెలుస్తోంది.
తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన హర్యానా సీఎం ఖట్టర్ ముందుగా శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందతో భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్ కు మార్గదర్శిగా ఉన్న ఆయనతో ఖట్టర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడ ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఏపీ సీఎం జగన్ తో భేటీ అంటూ వార్తలు వచ్చాయి. వెంటనే షెడ్యూల్ కూడా ఖరారైంది. దీంతో ఇవాళ వైజాగ్ వెళ్లిన సీఎం జగన్.. హర్యానా సీఎం ఖట్టర్ లో పెమా వెల్ నెస్ రిసార్ట్స్ లో భేటీ అయ్యి ఏకాంతంగా చర్చలు జరిపారు.
వాస్తవానికి ఏ కారణం లేకుండా ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీకి రావడం, సీఎం జగన్ తో అమరావతిలో భేటీ కాకుండా విశాఖకు ఆయన్ను రప్పించుకుని మరీ చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పెద్దల నుంచి జగన్ కు ఆయన ఏమైనా సందేశం తెచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
అంతే కాదు మిగతా ముఖ్యమంత్రులతో అంటీ ముట్టనట్టుగా ఉండే సీఎం జగన్.. హర్యానా సీఎం కోసం వైజాగ్ వెళ్లి మరీ రిసార్ట్ లో భేటీ కావడం, అందులోనూ చర్చల వివరాలు బయటపెట్టకుండా మర్యాదపూర్వక భేటీ అని ప్రభుత్వ వర్గాలు చెప్పడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ రాజధానిగా ఎంచుకున్న విశాఖలో వీరిద్దరి భేటీ జరగడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.