ప్రభుత్వ వ్యతిరేక ఓటును అధిగమించడానికి సీఎం జగన్ కొత్త వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్రమక్రమంగా వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో ఉన్న అన్ని పార్టీలు అందుకనుగుణంగా తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని, టీడీపీ వైసీపీని బలహీనం చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించుకున్నాయి. ఇరు పార్టీల నుంచి చేరికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా వైసీపీలోకి చేరికలుంటాయని , శ్రావణమాసంలో అన్నీ మంచిరోజులే ఉంటాయనే నమ్మకం ఉండటంతో పచ్చజెండా ఊపాలని అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.
సర్వే ప్రభావం
ప్రశాంత్ కిషోర్ సర్వేతోపాటు పలు ఏజెన్సీల సర్వే నివేదికలను తెప్పించుకొని వాటిని క్రోడీకరించుకున్న ముఖ్యమంత్రి జగన్ టీడీపీని బలహీనం చేయడానికి పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల్లో పోటీచేయడానికి అభ్యర్థుల కొరత లేకపోయినప్పటికీ, ఆశావహ అభ్యర్థులు కూడా ఉన్నప్పటికీ టీడీపీ నుంచి చేరికలను ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకోవడం వెనక ఎన్నికల్లోగా ఆ పార్టీని బలహీనపరచాలనే వ్యూహం దాగివుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులపై గురి
తెలుగుదేశం పార్టీలో జిల్లాలవారీగా, నియోజకవర్గాలవారీగా బలమైన నేతలను వైసీపీ ఇప్పటికే గుర్తించింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లాంటివారు వైసీపీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు.
అలాగే గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయినవారిపై వైసీపీ దృష్టిసారించింది. వారిలో బలమైన నేతలను తమవైపు తిప్పుకుంటే వారిద్వారా వచ్చే ఓటింగ్ తో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అధిగమించవచ్చని భావిస్తోంది. టికెట్లు దక్కవనుకుంటే వైసీపీలో వారికి భరోసా కల్పిస్తామనే హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలనేది అధిష్టానం యోచనగా ఉంది.
సిద్ధమైన జాబితా
నియోజకవర్గాల్లో టీడీపీకి బలంగా ఉన్నవారు, రాబోయే ఎన్నికల్లో పోటీపడే ప్రయత్నం చేస్తున్న అభ్యర్థుల జాబితాను వైసీపీ ఇప్పటికే సిద్ధం చేసిందని సమాచారం. ఎన్నికలు సమీపించేవరకు ఆగాలా? లేదంటే ముందుగానే చేర్చుకోవాలా? అనే విషయంలో కొంత సందిగ్ధత ఉందని, దీనిపై వారంరోజుల్లోనే స్పష్టత వస్తుందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.