"అక్కడ బలంగా ఉందనుకుంటే లాగేయండి".. మొహమాటం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో జరగాల్సినప్పటికీ ఏ క్షణమైనా ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందరూ సిద్ధంగా ఉండాలంటూ ఇటీవలే మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ కూడా సాధ్యమైనంత వేగంగా జిల్లాలను చుట్టేస్తున్నారు. వాతావరణం చూస్తే ఏ క్షణమైనా ఎన్నికలు జరిగే అవకాశం అన్నట్లుగా మారిపోయింది.
జిల్లాల్లో చంద్రబాబు రోడ్ షోలు
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా జిల్లాల్లో రోడ్ షోలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు ముందస్తు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో ఏ పార్టీకాపార్టీ గెలుపు వ్యూహాలను రచించుకుంటోంది. ఈ వ్యూహాల్లో వైసీపీ ఇతర పార్టీలకంటే ఒకడుగు ముందే ఉంది. ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గావారీగా సమీక్షలతోపాటు ప్రతి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. 'గడప గడపకు మన ప్రభుత్వం'ద్వారా వస్తున్న ఫలితాలను క్రోడీకరిస్తున్నారు.
'గడప గడప'ను బట్టి సీట్ల కేటాయింపు
వీటిని బట్టే రేపు సీట్ల కేటాయింపు ఉండబోతోంది. వైసీపీ ఎక్కడైతే బలహీనంగా ఉంది అని జగన్ భావిస్తున్నారో అక్కడ ఎటువంటి మొహమాటం లేకుండా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకుంటున్నారు. అందుకనుగుణంగా జగన్ చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచే 'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించారు. అలాగే మదనపల్లెకు చెందిన పార్టీ కీలక నేతలను చేర్చుకున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో పై చేయి సాధించడానికి వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉంటుందో గుర్తించి అక్కడ నేతలను పార్టీలోకి చేర్చుకోవడంద్వారా ఆ పార్టీని బలహీనం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో టీడీపీని బలహీనం చేసే దిశగా..
అలాగే ఉత్తరాంధ్ర కూడా టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. అక్కడి మూడు ఉమ్మడి జిల్లాల్లోను టీడీపీని బలహీనపరిచే ప్రక్రియకు జగన్ శ్రీకారం చుట్టారు. ఎన్నికల నాటికి బలమైన నాయకులందరినీ లాగేస్తే టీడీపీ బలహీనపడుతుందన్నది జగన్ వ్యూహంగా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కీలకనేతలతో వైసీపీ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనే విషయంలో నాయకులు ఒక జాబితా తయారుచేశారు. అలాగే టీడీపీ కూడా వైసీపీ నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పనులు జరగకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంవల్ల నాయకులంతా అసంతృప్తితో ఉంటారని, అటువంటివారిని గుర్తించి పార్టీలో చేర్చుకోవడంద్వారా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలనుకునే నాయకులు ఆగిపోతారని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.