ఏపీలో వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం, కర్ఫ్యూ కొనసాగింపు: సీఎం జగన్ కీలక ఆదేశాలు
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం, ఊరేగింపులు వద్దు
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తోన్న కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని అధికారులకు తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పండగల సీజన్లో జాగ్రత్తలు పాటించాలని, వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని వైద్యుల సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు మత్రమే అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయాకూడదని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం పేర్కొన్నారు.

నవంబర్ నాటికి ఏపీలో 18ఏళ్ల నిండినవారందరికీ వ్యాక్సిన్ డోసు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై ఒక ఆలోచన కూడా చేయాలని అధికారులకు సూచించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత ఏ రకంగా అడుగులు ముందుకేయాలనే దానిపై సరైన ఆలోచనలు చేయాలన్నారు. నవంబర్ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ ఇస్తామమని అధికారులు సీఎం జగన్కు వివరించారు. 18 ఏళ్లు నిండినవారందరికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..
రాష్ట్రంలో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు అమల్లో ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. బయోమెట్రిక్తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని, ప్రభుత్వ ఆసత్పుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ఈమేరకు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకారదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Recommended Video

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 59,566 నమూనాలను పరీక్షించగా.. 1378 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1378 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,16,680కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.
అత్యధికంగా కృష్ణా జిల్లాలో నలుగురు మరణించగా, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,877 మృతి చెందారు.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1139 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,88,101కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 14,702 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,67,45,035 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 242 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో 13 మంది కరోనా బారినపడ్డారు.ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 22, చిత్తూరులో 219, తూర్పుగోదావరిలో 242, గుంటూరులో 101, కడపలో 61, కృష్ణాలో 178, కర్నూలులో 15, నెల్లూరులో 166, ప్రకాశంలో 119, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 69, విజయనగరంలో 13, పశ్చిమగోదావరిలో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,86,081, చిత్తూరులో 2,38,557 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,449) కరోనా కేసులున్నాయి.












Click it and Unblock the Notifications