వైఎస్ జగన్ డిమాండ్స్: అమరావతిపై ఏం చేద్దాం: ఢిల్లీ ప్రయాణం: కంప్లీట్ షెడ్యూల్ ఇదే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ దేశ రాజధానికి ప్రయాణం కట్టనున్నారు. ఎప్పట్లాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్ల చిట్టాను వెంట తీసుకెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన హస్తినలో గడుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ను కలుసుకోవాల్సి ఉంది. ప్రధాని అపాయింట్మెంట్ లభించింది. ఈ సాయంత్రం ఆయన మోడీని కలుస్తారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు.

కంప్లీట్ షెడ్యూల్ ఇదే..
ఈ ఉదయం 10:20 నిమిషాలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతుారు. 10:40 నిమిషాలకు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 10:50 నిమిషాలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి టేకాఫ్ తీసుకుంటారు. మధ్యాహ్నం 1:05 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు.

4 గంటలకు పీఎంఓకు..
మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి 1-జన్పథ్కు రోడ్డుమార్గంలో బయలుదేరి వెళ్తారు. 2 గంటలకు జన్పథ్కు చేరుకుంటారు. 3:45 నిమిషాల వరకు రిజర్వ్. 3:45 నిమిషాలకు అక్కడి నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి బయలుదేరుతారు. 4 గంటలకు ప్రధాని మోడీని కలుస్తారు. సుమారు 40 నిమిషాల పాటు వైఎస్ జగన్.. ఆయనతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతి సహా..
అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహా పలు అంశాలను ప్రధానితో చర్చిస్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున దాని నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉంది. దీని నిర్మాణానికి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం రీఎంబర్స్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనితోపాటు- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన పెండింగ్ నిధుల గురించీ వైెస్ జగన్- ప్రధాని వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రానికి 4,900 కోట్ల రూపాయలకు పైగా అందాల్సి ఉంది.

మూడు రాజధానులపై స్పష్టత..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును వైఎస్ జగన్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ బిల్లును మళ్లీ ఈ అసెంబ్లీ బడ్జెట్ లేదా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దీనిపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు లేకుండా బిల్లును తీసుకుని రావాలనేది ఆయన ఉద్దేశం. దీనిపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటారని, ఇందులో భాగంగా- ప్రధాని వద్ద ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని చెబుతున్నారు.

పోలవరం పైనా..
రాజధానులను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉందంటూ కేంద్రం ఇదివరకే పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో- ప్రధాని నుంచి మరోసారి స్పష్టత తీసుకుంటారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సవరించిన అంచనాలను ఆమోదించాలని వైఎస్ జగన్.. ప్రధానిని మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. దీన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం.. 47 వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది.

విభజన హామీలపైనా..
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తెలంగాణతో అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్న జల వివాదాలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని వైఎస్ జగన్.. ప్రధానిని విజ్ఞప్తి చేయనున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సహా.. నీటి పంపకాలు, కేటాయింపులు.. వాటి వినియోగం వంటి అంశాలన్నింటినీ ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ- ఈ వివాదాలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ఏపీ ఏ రకంగా నష్టపోతోందనే విషయాన్ని ప్రధానికి వివరించనున్నారు.












Click it and Unblock the Notifications