త్వరలోనే వైఎస్ జగన్ కమ్యూనిటీ హైరింగ్?
చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం దింతేనపాడు, నాదెండ్ల మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి విడదల రజినీ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు. వీరి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి విడదల రజినీ హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హైరింగ్ పద్ధతిలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను ప్రభుత్వం అందిస్తోందని, త్వరలోనే రాయితీపై యంత్ర పరికరాలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ కసరత్తులు చేస్తున్నారని, రైతులు ఎటువంటి నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదని ఆమె వారిలో ధైర్యాన్ని నింపారు.
రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు, వారి పనులు వేగంగా పూర్తయ్యేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 50శాతం రాయితీతో రూ.403 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే రైతు రథం పేరుతో రూ.175 కోట్లతో 3,800 ట్రాక్టర్లను ప్రభుత్వం రైతులకు అందజేసింది. వీటికి అదనంగా యంత్ర పరికరాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఏ తరహా పరికరాలు అందిస్తే వారికి ఉపయోగపడుతుందో అనే విషయమై ఇటీవలే సర్వే కూడా నిర్వహింపచేసింది. ప్రతి గ్రామానికి 20 మంది చొప్పున రైతులను ఎంపిక చేసి, 1.80 లక్షల రైతుల అభిప్రాయాలను తీసుకుంది. తమకు ఏ తరహా పరికరాలు అవసరమవుతాయో అన్నింటినీ వారు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 68వేల మందిని ఎంపిక చేసి రూ.15వేల విలువైన వ్యవసాయ యూనిట్లను రూ.403 కోట్ల వ్యయంతో అందరికీ అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.