చంద్రబాబు తరువాత వైఎస్ జగన్: పర్యటన ఫిక్స్
అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గోదావరికి సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనను నిర్వహించనున్నారు. లంక గ్రామాల ప్రజలను ఆయన స్వయంగా కలుసుకోనున్నారు. వారికి అందుతోన్న ప్రభుత్వం సహాయ కార్యక్రమాల గురించి వారినే అడిగి తెలుసుకోనున్నారు.
ఉపనదులు సైతం..
ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగింది. ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, పెన్ గంగా కూడా వరద పోటుకు గురయ్యాయి. ఆయా నదుల పరీవాహక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు కురిశాయి. ప్రాణహిత, శబరి, తాలిపేరు నుంచి ఎక్కువగా వరద నీరు గోదావరికి చేరింది. దీని ధాటికి రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. వేలాది హెక్టార్లల్లో పంట నీట మునిగింది. తెలంగాణలో భద్రచాలాన్ని వరదనీరు ముంచెత్తింది.
గోదావరీ తీర గ్రామాల్లో..
ఏపీలో కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, ఏటపాక, వర రామచంద్రాపురం, పీ గన్నవరం, రాజోలు మండలాల పరిధిలని గ్రామాల్లో వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రామస్తులు తమ నివాసాలకు చేరుకుంటోన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మూడు రోజుల పాటు ఆయన మకాం వేశారు.
సమీక్షలతో..
ఇక తాజాగా వైఎస్ జగన్.. ఆయా ప్రాంతాలను సందర్శించనున్నారు. వరద సహాయక కార్యక్రమాలకు జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో ప్రముఖులు సందర్శించడం వల్ల అధికార యంత్రాంగం విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఆలస్యంగా ఆయా ప్రాంతాలకు వెళ్లనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వరదలపై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సహాయక, పునరావాస శిబిరాలను ముందుగానే ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు.
రూ.10 కోట్లు విడుదల..
భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం అందినప్పటి నుంచీ ఆయన ముందస్తు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అధికార యంత్రాంగాన్నిఅప్రమత్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు సుమారు 10 కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. ఇక తాజాగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. బాధితులను స్వయంగా కలుసుకోనున్నారు. నీట మునిగిన వ్యవసాయ పొలాలను సందర్శించనున్నారు.