ఐఏఎస్ సర్వీసు రూల్స్ సవరణ ఓకే కానీ,..: ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ, కీలక సూచన
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల్లో సవరణలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్పై పంపాలనే కేంద్ర నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారు. అయితే, దీని కారణంగా ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ పలు కీలక సూచనలు చేశారు.

ఆ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేయాలంటూ మోడీకి సీఎం జగన్
రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసుకు పంపడానికి ఇబ్బంది లేదని, కానీ, ఎవర్ని పంపాలి అనే అంశం రాష్ట్రాలే నిర్ణయిస్తే బాగుంటుందని లేఖలో తెలిపారు. అధికారుల పనితీరు, సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తుంది కాబట్టి ఆ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. కేంద్రానికి డిప్యూటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని లేఖలో పేర్కొన్నారు జగన్. ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది.

కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తూనే సమస్యను ప్రధాని దృష్టికి
కాగా, రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యుటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల అంశంలో సవరణలు తీసుకుని వస్తున్న కేంద్ర చొరవను అభినందించారు సీఎం జగన్. అయితే రాష్ట్రాలు నిరభ్యంతర పత్రాలు విడుదల చేసిన తర్వాతే డిప్యూటేషన్ ఖరారవుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. డిప్యూటేషన్ పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకుని వస్తున్న తాజా సవరణ పై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం జగన్. ఉన్నట్టుండి కీలక బాధ్యతల్లో ఉండే అధికారులు వెళ్ళిపోతే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయనే సమస్యను లేఖలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాగా, మధ్యప్రదేశ్, మేఘాలయ, బీహార్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కూడా సవరణపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరిపోయింది.

ఐఏఎస్ సర్వీస్ రూల్స్ సవరణను వ్యతిరేకించిన కేసీఆర్, పలు రాష్ట్రాలు
కాగా, ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు కూడా రాశారు.












Click it and Unblock the Notifications