YSజగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్?
వచ్చే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించడమే కాకుండా 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో ప్రజాప్రతినిధులందరినీ ప్రజలకు చేరువ చేస్తున్నారు.

కీలకమైన పోస్టుల్లో అధికారుల నియామకం
ఈ కార్యక్రమంవల్ల సమస్యలేవైనా ఉంటే కొన్ని అక్కడికక్కడే పరిష్కరింపబడతాయని, దీనిద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని జగన్ భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ రానున్న ఎన్నికల కోసం వాటిని కొనసాగిస్తానని వాగ్ధానం ఇవ్వబోతున్నారు. ఇది పార్టీకి కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఎన్నికల సమయంలో తనకు అనుకూలంగా ఉంటారని భావిస్తున్నారో.. వారందరినీ ముందుగానే కీలకమైన పోస్టుల్లో నియమించారు.

3 రాజధానులు, సంక్షేమ పథకాలు రెండుకళ్లు
సంక్షేమ పథకాల కొనసాగింపు అనేది ఎన్నికల వాగ్దానంలో ఒక కన్నుకాగా, మూడు రాజధానుల అంశమనేది మరో కన్నుగా రాజకీయవేత్తలు భావిస్తున్నారు. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నం కూడా రాజధానులుగా ప్రకటించడంవల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో భావోద్వేగాలు కలిగి వైసీపీకి కలిసివస్తాయంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలనే అంశంపై స్టే విధించడంతో ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలిగింది. జనవరిలో తీర్పు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా తనకు ఎన్నికలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అంచనా వేస్తున్నారు.

వారిద్దరూ పొత్తు పెట్టుకున్నా గెలుస్తాను..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నా సంక్షేమ పథకాలు, మూడు రాజధానులే తనను గెలిపిస్తాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా? ఒకచోటే కేంద్రీకృతం కావడంవల్ల హైదరాబాద్ ను కోల్పోయామని, మరోసారి అటువంటి తప్పు జరగకూడదని భావిస్తున్నారు. మూడు రాజధానులు, సంక్షేమ పథకాల పద్మవ్యూహంలో చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను జగన్ బంధించగలిగారని, ఎన్నికల వరకు ఇదే వ్యూహాన్ని అప్రమత్తంగా అమలు చేయగలిగితే రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం కూడా సులువేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications