చంద్రబాబు రాజీనామాకు డిమాండ్, 'మేం సారీ చెప్పాం, జగన్ మాత్రం..'
ఆర్టీఏ అధికారులపై తెలుగుదేశం పార్టీ నేతల దాడిని ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. రౌడీయిజాన్ని సీఎం చంద్రబాబు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి రా
అమరావతి: ఆర్టీఏ అధికారులపై తెలుగుదేశం పార్టీ నేతల దాడిని ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. రౌడీయిజాన్ని సీఎం చంద్రబాబు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబు పంచాయితీలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
దాడి ఘటనలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జుగుప్సాకరంగా సాగుతున్నాయన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను విస్మరించడం బాధాకరమన్నారు.
మేం క్షమాపణ చెప్పాం
తలనొప్పేంటి, అంతా తెలుసు, సారీ చెప్పండి: బాబు ఆగ్రహం, ముందే రిపోర్ట్..
విజయవాడలో జరిగిన ఘటనలో తాము అధికారంలో ఉన్నా ఎటువంటి భేషజాలకూ పోకుండా రవాణా కమిషనరేట్కి వెళ్లి అధికారులను క్షమించమని కోరామని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ చెప్పారు. ప్రతిపక్షాలు చిన్న ఘటనను పెద్దది చేస్తోందని, అనవసర రాజకీయం చేస్తోందని బోండా ఉమ మండి పడ్డారు.
జరిగిన ఘటనపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. జగన్ ఐపీఎస్లతో ఇష్టానుసారం ప్రవర్తించి కనీసం వారికి క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. తాము అధికార పక్షంలో ఉన్నా జరిగిన ఘటనపై క్షమాపణ కోరామన్నారు. ఇలాంటి ఘటనలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని ఉమ పేర్కొన్నారు.
కాగా, ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన టిడిపి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించందని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సభలో ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపు అంశాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన లేవనెత్తారు.
ఉద్యోగులకు పీఆర్సీ కూడా అమలు చేయకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. డీఏ, మెడికల్ రీయింబర్స్మెంట్ లాంటి పథకాలను కూడా సక్రమంగా అమలు చేయకుండా సమస్యల్లోకి నెడుతోందన్నారు.
ఉద్యోగులకు జీతాలు చెల్లించచమే ఎక్కువ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై దాడికి పాల్పడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే, ఉద్యోగులపై దాడి ముగిసిన అంశమని టిడిపి చెబుతోంది.