ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 24 గంటల్లో 11 వేలకు పైగా- సెంచరీ దాటి మరణాలు
ఏపీలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో కేసులు దాదాపు సగానికి తగ్గాయని సంబరపడే లోపే మళ్లీ మూడు వేల అదనపు కేసులు వచ్చి పడ్డాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 11303 కొత్త కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య కూడా మరోసారి సెంచరీ దాటేసింది. మొత్తం 93704 శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తాజా హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
కరోనా కొత్త కేసుల విషయానికొస్తే మరోసారి అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2477 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత యథావిథిగా చిత్తూరు జిల్లాలో 1536 కేసులు నమోదయ్యాయి. ఆశ్చర్యకరంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కసారిగా పెరిగి 1116 కొత్త కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో విశాఖ 985, అనంతపురం 953, ప్రకాశం 935, శ్రీకాకుళం 693, కృష్ణా 647, గుంటూరు 686, నెల్లూరు 444, కడప 323, కర్నూలు 286 కేసులు వచ్చాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 17.04 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 15.46 లక్షల మంది కోలుకున్నారు. మరో 1.46 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల విషయానికొస్తే పశ్చిమగోదావరి జిల్లాలో మరణమృదంగం మోగుతోంది. నిన్న ఒక్కరోజే జిల్లాలో 20 మంది కరోనాతో చనిపోయారు. చిత్తూరులో 14, అనంతపురంలో 9, గుంటూరులో 9, తూర్పుగోదావరిలో 8, విశాఖలో 7, కృష్ణాలో 6, కర్నూల్లో 6, శ్రీకాకుళంలో 6, విజయనగరంలో 6, కడపలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు కరోనాతో మరణించారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో మరణాల సంఖ్య 11 వేలు దాటిపోయింది.