ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు : 24 గంటల్లో 12768- 98 మరణాలు-తూర్పున అదే కల్లోలం
ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం భారీగా కేసులు తగ్గినట్లు కనిపించినా మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గడం కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో 12768 కొత్త కేసులు నమోదయ్యాయి. 98 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా తూర్పుగోదావరిలో మాత్రం కరోనా ఉధృతి కొనసాగుతోంది.
ఏపీలో గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్ని చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2703 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరులో 1551, అనంతపురంలో 1506 కేసులు వచ్చాయి. పశ్చిమగోదావరిలో 1052 కేసులు వెలుగుచూశాయి. మిగతా జిల్లల్లో మాత్రం వెయ్యికి లోపే కేసులు నమోదయ్యాయి. విశాఖ 844, కృష్ణా 841, నెల్లూరు 785, గుంటూరు 765, ప్రకాశం 734, కడప 699, శ్రీకాకుళం 561, విజయనగరం 253 కేసులు వచ్చాయి.
వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో 17.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 15.62 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 1.43 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల విషయానికొస్తే అత్యధికంగా చిత్తూరులో 15 మంది, నెల్లూరులో 10, పశ్చిమగోదావరిలో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 8, విజయనగరంలో 8, గుంటూరులో 7, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 7, విశాఖలో 6, కృష్ణాలో 5, కడపలో 4, కర్నూలో 4 మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ కరోనాతో రాష్ట్రంలో 11132 మంది చనిపోయారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 98048 టెస్టులు నిర్వహించింది.