Why Not Ops? : మరోసారి ఉద్యోగుల ఛలో విజయవాడ..! తాడోపేడో ?
ఏపీలో సీపీఎస్ రద్దుకు గతంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అయితే ప్రభుత్వం దీని స్ధానంలో తిరిగి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)కు బదులుగా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్)ను తీసుకొచ్చింది. గ్యారంటీ పెన్షన్ స్కీం పేరుతో తెచ్చిన పథకం వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ అందే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి జీపీఎస్ ను ఒప్పుకోవాలని ఉద్యోగులను కోరింది. అయితే వారు మాత్రం తమకు జీపీఎస్ వద్దని, సీపీఎస్ వద్దని, కేవలం ఓపీఎస్ మాత్రమే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులు తాజాగా సమావేశమయ్యారు. జీపీఎస్ అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు మరోసారి ఛలో విజయవాడ పేరుతో భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి వై నాట్ ఓపీఎస్ పేరుతో ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లుప సీపీఎస్ సంఘాలు వెల్లడించాయి.

అయితే ఈసారి సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించే ఛలో విజయవాడ నిరసనకు ఏపీ ఎన్జీవోలు కూడా మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న జరిగిన సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ ప్రకటనకు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్జీవోల అధ్యక్షుడు విద్యాసాగర్ మద్దతు ప్రకటించారు. దీంతో ఈసారి ఛలో విజయవాడ కార్యక్రమంపై ఉత్కంఠ పెరుగుతోంది. పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎన్జీవోలు కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఓపీఎస్ ను సాధించుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఛలో విజయవాడ పేరుతో ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమం ఓసారి విజయవంతమైంది. దాని తర్వాతే పలు ఉద్యోగసంఘాలు, ఉద్యోగ నేతలు టార్గెట్ అయ్యారు. వీరిలో టీచర్ల సంఘాల నేతలతో పాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ కూడా ఉన్నారు. అలాగే అప్పట్లో పెట్టిన కేసుల్ని సైతం ప్రభుత్వం ఇప్పటివరకూ వెనక్కి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఈసారి వీరిని ఎలా కట్టడి చేయబోతోంది, ఎన్నికల ముందు వీరి నిరసనలు ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాన్నది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications