అసత్య ప్రచారాలు చేయొద్దు: ఏపీలో డ్రగ్స్, గంజాయి సమస్యపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి: ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్కి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు డీజీపీ గౌతమ్ సవాంగ్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణపై డీజీపీ మంగళవారం సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో గంజాయి నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెలపాటు గంజాయిపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఎన్ఐఏ సహకారంతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నామని డీజీపీ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తూ గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరిని చట్టం ముందుకు తీసుకువస్తామని డీజీపీ తెలిపారు. ఇప్పటికే 463 మంది అంతర్రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టినట్లు డీజీపీ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 1500 వాహనాలను జప్తు చేసి, 5 వేల మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.
సంబంధం లేని అంశాలపై అసత్య ఆరోపణలను మానుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా గంజాయి సాగు చేస్తున్నారని, నియంత్రణకు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత పదేళ్లతో పోలిస్తే గతేడాది స్వాధీనం చేసుకున్న గంజాయే ఎక్కువ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.
Recommended Video
ఇది ఇలావుండగా, టీడీపీ నేతలు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ గంజాయి హబ్గా, మాదకద్రవ్యాల నిలయంగా మార్చారని ఆరోపిస్తున్నారు. డ్రగ్స్, గంజాయిని అరికట్టడంలో ఏపీ సర్కారు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ అధినేతలు చంద్రబాబు, నారా లోకేష్ తోపాటు పలువురు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.