లాక్ డౌన్ తర్వాత పెద్ద ఎత్తున చోరీలు... నేరాల రేటూ పెరుగుతుందా ? పోలీసుల క్లారిటీ...
దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలు, కూలీనాలీ చేసుకుని జీవించే వారు సైతం రోజు గడవక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సాధారణ రోజుల్లో నేరాలకు పాల్పడే దొంగలు, నేరస్తులకు చేతిలో పని లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వీరంతా ఎక్కడున్నారన్న అంశాన్ని పక్కనబెడితే ఓసారి లాక్ డౌన్ ఎత్తివేశాక వీరంతా విజృంభించవచ్చన్న ప్రచారం సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం సాధారణ జనానికి నిద్రలేకుండా చేస్తోంది. దీనిపై ఏపీ పోలీసులు తాజాగా స్పందించారు.
లాక్డౌన్ ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీస్ హెచ్చరిక పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ పోస్టింగ్లపై స్పందించిన ఆయన.. లాక్డౌన్ తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తెలిపారు.
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని, ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Recommended Video
ప్రజలకు ఏ ఆపద వచ్చినా 100, 112, 104, 108 నంబర్లకు కాల్ చేయాలని... ప్రస్తుత పరిస్థితికి అన్వయించి రోజువారీ జాగ్రత్తలను కూడా జతచేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. లాక్డౌన్ తర్వాత పిల్లలు, మహిళలను నేరస్తులు టార్గెట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని డీజీపీ కోరారు. ప్రజల దైనందిన జీవనం, ఇంటి వద్ద భద్రత వంటి అనేక అంశాలకు ముడిపెట్టి వారిని భయపెట్టేలా వదంతులు సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications