తెలంగాణ పోలీసులతో ఇబ్బంది లేదు, సెక్షన్-8 అవసరం: డిజిపి రాముడు
విశాఖపట్నం: ఓటుకు నోటు కేసులో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన చమురు సంస్థల సిఈఓలతో చమురు, గ్యాస్ పైప్ లైన్ల భద్రతపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సెక్షన్ 8 అవసరాన్ని నొక్కి చెబుతూ వ్యాఖ్యానించారు. అవసరం ఉంది కాబట్టే సెక్షన్ 8 అమలును కోరుతున్నా మని, హైదరాబాద్లో సెక్షన్ 8 ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు.

విశాఖలో చమురు, గ్యాస్ పైప్ లైన్ల భద్రతపై సమీక్ష నిర్వహించిన ఏపీ డీజీపీ రాముడు సెక్యూరిటీ ఏజెన్సీలు, చమురు కంపెనీల సీఈవోలకు పలు సూచనలు చేశారు. ఉగ్రవాదుల నుంచి చమురు సంస్థలకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ, ప్రజలతో భాగస్వాములు కావాలని కంపెనీలకు పిలుపునిచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని డిజిపి రాముడు కోరారు. ఇప్పటికే పలువురు ఏపి మంత్రులు, నేతలు సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications