తెలంగాణకు ఒకే చెప్పి.. ఏపీ డీజీపీ పూర్తి పదవీ కాలానికి కేంద్రం బ్రేక్
గుంటూరు: రాష్ట్ర ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న 'నండూరి సాంబశివరావు'ను పూర్తికాలపు డీజీపీగా నియమించడానికి కేంద్రం బ్రేక్ వేసింది... మరో నెలన్నర రోజులు మాత్రమే సర్వీసు ఉన్న 'నండూరి'ని పూర్తికాలపు డీజీపీగా నియమించాలని ఆయనతో పాటు మరో ఆరుగురు ఉన్నతాధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అయితే రాష్ట్ర ప్రతిపాదనలపై కేంద్రం సీరియస్ అయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం... మరో సంవత్సరం మాత్రమే సర్వీసు ఉన్న ఎస్వి.రమణమూర్తి, డిసెంబర్ ఆఖరుకు రిటైర్కానున్న నండూరి సాంబశివరావు, మాలకొండయ్యల పేర్లు పంపడంపై కేంద్రం మండిపడింది. మళ్లీ తాజా జాబితాను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో రాష్ట్ర డీజీపీగా వ్యవహరించిన జె.వి.రాముడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 'సుప్రీంకోర్టు' ఉత్తర్వుల స్ఫూర్తిని ఉల్లంఘించారని, ఈసారి అదే విధంగా చేయవద్దని కోరింది. జె.వి.రాముడు వ్యవహారంలో ఆయన రిటైర్మెంట్కు మరో రెండు నెలలు మాత్రమే గడువు ఉన్నప్పుడు ఆయనను డీజీపీగా నియమించాలంటూ కేంద్రాన్ని కోరింది. అయితే 'సుప్రీంకోర్టు' ఉత్తర్వుల ప్రకారం డీజీపీగా నియమితులైన వారు రెండేళ్ల కాలం పాటు ఉండాలి. గతంలో 'ప్రకాశ్సింగ్' వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో(రిట్పిటీషన్ నెం.310/96) డీజీపీగా నియమించిన వ్యక్తి సర్వీసు రెండేళ్లు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆ ఉత్తర్వులను తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం జె.వి.రాముడు మరో రెండు నెలల్లో రిటైర్ అవుతారనే సమయంలో మళ్లీ డీజీపీగా నియమించింది. అంటే ఆయనకు దాదాపు 22 నెలల సర్వీసు అదనంగా వచ్చింది. ఇప్పుడు డీజీపీ సాంబశివరావు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇన్నాళ్లు ఆయనను ఇన్ఛార్జి డీజీపీగా కొనసాగించి..మరో నెలన్నర రోజుల్లో రిటైర్ అయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనను పూర్తికాలపు డీజీపీగా నియమించాలని కేంద్రాన్ని కోరింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వ కోరికను కేంద్రం తిరస్కరించి అర్హులైన వ్యక్తులతో నూతన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలోపెట్టుకుని ఆయన ఇన్ఛార్జి డీజీపీ 'నండూరి సాంబశివరావు'ను సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉండాలని ఆశించారు. అయితే ఇప్పుడు కేంద్రం వైఖరితో 'బాబు' వేసుకున్న ప్రణాళికలు పారలేదు.
ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ఆ రాష్ట్ర డీజీపీగా మహేందర్రెడ్డి నియామకానికి అంగీకారం తెలిపిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెనక్కు పంపడం సీఎం చంద్రబాబుని ఇరకాటంలో పెట్టినట్లు అయ్యింది. అయితే చంద్రబాబు మాత్రం తన పంతం నెగ్హించుకునేందుకు డిల్లీ లెవల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు...అయితే చంద్రబాబు మంత్రగం ఫలిస్తుందో లేదంటే కేంద్రం ఆదేశాలకు తలొగ్గి చంద్రబాబు అర్హుల పేర్ల జాబితా మరో మారు పంపిస్తారో అనే అంశం ఆసక్తి గా మారింది...ఒకవేళ కొత్త జాబితా పంపితే లిస్ట్ లో ఎవరి పేర్లు చేరుస్తారు...పూర్తి స్తాయి డిజిపి పదవి ఎవరిని వరిస్తుంది అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.