హైద్రాబాద్పై నాలుగు ఆప్షన్స్: ఏఐసిసి వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: విభజన ప్రక్రియలో క్లిష్టంగా మారిన హైదరాబాదు విషయంలో ఢిల్లీ పెద్దలు పలు మార్గాలు ఆలోచిన్తున్నారట. ఓ వైపు హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణనే తాము కోరుకుంటున్నామని తెలంగాణవాదులు, మరోవైపు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నేతలు, డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై తర్జన భర్జన పడుతోంది.
హైదరాబాదు పైన ప్రధానంగా నాలుగు మార్గాల పైన ఆలోచిస్తోందని తెలుస్తోంది. తెలంగాణవాదుల్లో అసంతృప్తి, ఆందోళన తలెత్తకుండా అదే సమయంలో సీమాంధ్రులకు రక్షణ కల్పించే విధంగా ఏం చేయాలనే దిశలో సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్న నాలుగింటిలో ఒకటి కొత్త ప్రతిపాదన ఉన్నప్పటికీ మిగిలిన మూడు ఇప్పటికే దేశంలో అమలవుతున్నాయి.

పాండిచ్చేరి తరహా ప్రయోగం, చండీగఢ్ పద్ధతి లేదా ఢిల్లీ పద్ధతిలో హైదరాబాదును చేయాలనే ఆలోచనలో ఉందంటున్నారు. అయితే ఈ మూడింటి పైన కూడా తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచిస్తోంది.
రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ను ఉంచి, ఆయన పాలనలో ఉండేలా నాలుగో ప్రతిపాదన పైన చర్చిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని చూసే గవర్నర్కు ఇచ్చే అధికారాలను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకే ఇవ్వాలని యోచిస్తున్నారు. పంజాబ్, హర్యానాలకు రాజధానిగా ఉన్న చండీగఢ్లో ఎమ్మెల్యేలు ఉండరు కేవలం ఎంపీలు మాత్రమే ఉంటారు. అధికారిక వ్యవహారాలు గవర్నర్ ఆదీనంలో ఉంటాయి. మొదటి ప్రతిపాదనగా ఉన్న దీనిని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పుదుచ్చేరి తరహా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా అధికారులు గవర్నర్ చేతిలోనే ఉంటాయి.
మూడో తరహా ఢిల్లీ ప్రయోగం అయితే ప్రభుత్వం ఉన్నా కీలకమైన రెవెన్యూ, శాంతిభద్రతలు, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా వ్యవస్థల పాలనా పగ్గాలు గవర్నర్ చేతిలో ఉంటాయి. వీటన్నింటిన తెలంగాణవాదులు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. అయితే నాలుగో ప్రతిపాదన పైన ప్రధానంగా కేంద్రం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించిన విశాలాంధ్ర, ఉద్రిక్తం
విభజనను నిర్ణయాన్ని నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం రెండో రోజు ధర్నా చేపట్టారు. సాయంత్రం ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. విశాలాంధ్ర ఆధ్వర్యంలో పలువురు సమైక్యవాదులు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.












Click it and Unblock the Notifications