పెద్దాపురం టిక్కెట్ కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సోదరుడు
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన టిక్కెట్ కోసం క్రికెటర్ వేణుగోపాల రావు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు స్క్రీనింగ్ కమిటీకి ధరఖాస్తులు అందించిన విషయం తెలిసిందే.
ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి శుక్రవారం ఒక్క రోజే 220 బయోడేటాలు సమర్పించారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ) కూడా తన బయోడేటాను జనసేన స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి జనసేన తొలి అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. పితాని బాలకృష్ణ కూడా తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు. ఇంకా బయోడేటాలు సమర్పించిన వారిలో డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, యువకులు, మహిళలు ఉన్నారు. శుక్రవారం దాదాపు పదిమంది వైద్యులు జనసేన అభ్యర్ధిత్వం కోరుతూ బయోడేటాలు సమర్పించారు. వీరంతా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications