జగన్ సర్కార్ నుంచి బకాయిలు ఇప్పించరూ.. గవర్నర్ కు ఉద్యోగసంఘాల మొర..!
ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందడం లేదు. దీనిపై ప్రభుత్వం గతంలో పలుమార్లు హామీలు ఇచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ ను ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు.
రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ, అనేక సమావేశాలలో డిమాండ్ చేసినప్పటికీ ఫలితం శూన్యమని ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు గల గవర్నర్ ను కలసి ఈ అంశం నివేదించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఇవాళ ఉద్యోగ సంఘం నేతలు విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు ఆధ్వర్యంలో మొత్తం 8 మంది ప్రతినిధులు ఇవాళ గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయినా అధికారులు స్పందించడం లేదని, గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఉద్యోగ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తక్షణం జోక్యం చేసుకుని తమ బకాయిలు ఇప్పించాలని వారు కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్తున్నారు.
ఉద్యోగుల డీఏ బకాయిలు,జీపీఎఫ్ బకాయిలు,సీపీఎస్ వాటా నిధులు 10వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందని ఉద్యోగ నేత సూర్యనారాయణ గవర్నర్ ను కలిసిన అనంతరం వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించాలని గవర్నర్ ను కలిశామన్నారు. ఉద్యోగులు,పెన్షనర్లు,దినసరి కార్మికులకు చెల్లించాల్సిన నిధులు నెల చివరి రోజు లేదా తర్వాత నెల మొదటి రోజు చెల్లించాలని, ఉద్యోగుల వ్యవహారాల్లో ప్రభుత్వం జాలి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ కు జీవోలతో సహా అన్ని వివరాలు వివరించామన్నారు. ప్రభుత్వం నుంచి మొదటి చెల్లింపుదారుడిగా క్లెయిమ్స్ సెటిల్ చేసేలా చట్టాన్ని తీసుకురావాలని గవర్నర్ ను కోరామన్నారు. తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. ఏప్రిల్ నుంచి తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతున్నామన్నారు.