పండుగ వచ్చింది - జీతాల కోసం : సాంకేతిక సమస్యతో - ఉద్యోగుల అసంతృప్తి..!!
ఉగాది పండుగ వచ్చింది. కానీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీతాలు అందలేదు. తొలి పండుగ ..ప్రధానమైనది కావటంతో ఈ సారి పండుగకు ఖచ్చితంగా ఉద్యోగులకు జీతాలు అందుతాయని అశించారు. కానీ, కొత్త ఆర్దిక సంవత్సరం తొలి రోజున జీతాల కోసం నిరీక్షించారు. కానీ, తొలి రోజున జీతాలు అందని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధానంగా సాంకేతిక సమస్యే కారణంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్దిక శాఖ నిర్వాకంతో పండుగ నాడు జీతాలు రాలేదంటూ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుకు ఏపీ ఉద్యోగులకు జీతాలు అందలేదు.
కొత్త పీఆర్సీ అమలును ఏప్రిల్ 1 నుంచి పేరోల్ హెర్బ్ అనే వెబ్ ద్వారా వేతనాలు చెల్లింపులు జరుగుతాయని ఆర్ధిక శాఖ ప్రకటించింది. ఆ విధానంలోనే ఉద్యోగుల చర్చల సమయంలో పేరోల్ హెర్బ్ ద్వారా 2022 జనవరి వేతనాలను చెల్లించారు. ఫిబ్రవరి వేతనాలు అదే తరహాలో ఉద్యోగులు అందుకున్నారు. అయితే, ఈ నూతన పేరోల్ హెర్బ్ రిజర్వు బ్యాంకుకు అనుసంధానం కాకపోవటంతో మార్చి వేతన చెల్లింపులు నిలిచి పోయినట్లు తెలుస్తోంది. దీంతో..ప్రభుత్వ ఉన్నతాధికారులు మళ్లీ పాత విధానం హెచ్ఆర్ఎంఎస్ నుంచే వేతన బిల్లులను అప్ లోడ్ చేస్తున్నారు. అయితే, పెన్షనర్లకు మాత్రం సీఎఫ్ఎంఎస్ నుంచే ఆర్ధిక శాఖ చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 4 తర్వాత 50 శాతం మందికి.. ఆ తర్వాత రెండ్రోజుల్లో మిగతా 50 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం ఉందని చెబుతున్నారు. ట్ సోర్సింగ్ సహా ఇతర ఉద్యోగులకు సంబంధించిన వేతన బిల్లులు కూడా హెర్బ్ ద్వారానే చెల్లించాల్సి ఉండటంతో వారి వేతనాలు సైతం ఆలస్యం అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ చేసిన పనితో తమకు పండుగ నాడు జీతాలు అందకపోవటం పైన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో..చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని ఉద్యోగ సంఘాల నేతలతో వేతనాల చెల్లింపుల పైన ఆరా తీసారు. సాంకేతిక సమస్యే కారణంగా ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సమచారం పండుగ నాడు ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.