హెల్ప్ కోరిన బాబు: రాజధానికి రూ.200కోట్ల విరాళం
హైదారాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ, ఇతర ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రూ.200 కోట్ల విరాళం ప్రకటించింది. ఉద్యోగులకు వచ్చే కొత్త వేతన సవరణ బకాయిల్లో 15 రోజుల మొత్తాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తామని ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు తదితరులు గురువారం ప్రకటించారు.
ఏపీ అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం అనే అంశంపై ఆరో తేదీన తిరుపతిలో సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులతో పాటు సుమారు రెండువేల మంది ఇందులో పాల్గొంటారు.
కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించిన జీవోను ఈ నెల 6న జడారీ చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం తమకు హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని చెప్పారు.
సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు తర్వాత వాటిని భర్తీ చేయడానికి సెలవు రోజుల్లో పని చేసినందున వాటిని ఆర్జిత సెలవులుగా లేదా కాంపెన్షేటరీ సెలవులు గానీ పరిగణించేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, రాజధాని నిర్మాణానికి ఉద్యోగులు సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.