ఉద్యోగులపై ఇక చర్యలే-జగన్ సర్కార్ వార్నింగ్-ఇప్పుడే సమ్మెకు వెళ్తామని నేతల కౌంటర్
ఏపీలో ఉద్యోగుల పోరు మరింత తీవ్రమైంది. ముఖ్యంగా జీతాల బిల్లుల ప్రాసెసింగ్ వేళ ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు జీతాలు ప్రాసెసింగ్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయని ప్రభుత్వం చేసిన హెచ్చరికపై ఉద్యోగులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. క్రమ శిక్షణ చర్యలకు వెళితే ఇప్పుడే సమ్మె ప్రారంభిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు.
ఏపీ ఉద్యోగుల పోరు
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరు నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్యోగులు రిలే దీక్షలు, నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదే సమయంలో ఈ నెలకు పాత జీతాలనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పీఆర్సీకి కేబినెట్ ఆమోదముద్ర కూడా పడిందని, ఈసారి కొత్త జీతాలే ఇస్తామని చెబుతోంది. వీటి కోసం బిల్లుల్ని ప్రాసెస్ చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది.
జీతాలు ప్రాసెస్ చేయకపోతే చర్యలే
ఉద్యోగులకు కొత్తగా అమల్లోకి వచ్చిన పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ప్రతీ రోజూ ఆదేశాలు ఇస్తూనే ఉంది. అయినా ఉద్యోగులు మాత్రం పాత జీతాల ప్రకారమే బిల్లులు ప్రాసెస్ చేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇవాళ తీవ్ర హెచ్చరికలకు దిగింది. కొత్త పీఆర్సీ ప్రకారం ఈ నెలాఖరులోపు బిల్లులు ప్రాసెస్ చేసి ఫిబ్రవరి 1న జీతాలు అందేలా చూడాలని, ఇందులో విఫలమైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని డీడీవోలు, ఎస్టీవోలు, ఇతర ట్రెజరీ అధికారులకు హెచ్చరికలు పంపుతోంది.
Recommended Video
ఇప్పుడే సమ్మెకు దిగుతామని ఉద్యోగుల కౌంటర్
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయలేదనే కారణంతో ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు దిగుతామన్న ప్రభుత్వ హెచ్చరికపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు దిగితే వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాల్సిన సమ్మె కాస్తా ఇప్పుడే మొదలుపెట్టాల్సి వస్తుందని సచివాలయ ఉద్యోగుసంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెసింగ్ చేయాలని ఒత్తిడి చేయొద్దని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వం ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఇలాంటి హెచ్చరికలు చేయడంపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి.