పెట్రో ధరలు తగ్గించలేం-తేల్చేసిన ఆర్ధికమంత్రి బుగ్గన-ఢిల్లీలో నిర్మలమ్మతో భేటీ
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించింది. అదే సమయంలో రాష్ట్రాలు సైతం వ్యాట్ తగ్గించుకోవాలని సూచించింది. కానీ ఇప్పిటివరకూ బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ మాత్రమే వ్యాట్ తగ్గించాయి. దీంతో అక్కడి వినియోగదారులకు మాత్రమే ఊరట దక్కుతోంది. కానీ ఇప్పటికీ ఏపీ, తెలంగాణతో పాటు పలు బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు దీనిపై మౌనం వహిస్తున్నాయి.
ఏపీలో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుపై కొన్నిరోజులుగా మౌనం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తేల్చేసింది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపు కుదరని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో స్పష్టం చేశారు. ప్రస్తు పరిస్ధితుల్లో వ్యాట్ తగ్గించలేమన్నారు ఇవాళ ఢిల్లీలో పలు కీలక అంశాలపై చర్చించేందుకు బుగ్గన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన.. వ్యాట్ తగ్గింపు డిమాండ్లను తోసిపుచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ తేడా ఉందని, వారి ఖర్చులకూ, మన ఖర్చులకూ పొంతన లేదని బుగ్గన తెలిపారు. అందుకే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాట్ తగ్గించలేమని పేర్కొన్నారు. మరోవైపు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల లీజుల్ని రద్దు చేసి అన్ రాక్ తో వివాదం కొని తెచ్చుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ను ఎదుర్కొంటోంది.
దీంతో కేంద్రాన్ని మరోసారి ఇందులో జోక్యం చేసుకోవాలని ఆర్ధికమంత్రి బుగ్గన కోరారు. అన్ రాక్ తో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ లో ఏపీ ప్రభుత్వానికి సాయం చేసి తమను బయటపడేయాలని ఆయన కోరుతున్నారు. కానీ కేంద్రం మాత్రం లీజులు మీరు రద్దు చేసి పరిహారం మమ్మల్ని ఇమ్మంటారా అని ప్రశ్నిస్తోంది. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడుతోంది.