ఏబీ మరో సంచలనం- వివేకా హత్యపై సీబీఐకి లేఖ- కీలక ఆధారాలు ఇస్తానంటూ
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. దీంతో ఈ హత్య కేసుపై అటు సీబీఐతో పాటు ఇటు వైసీపీ సర్కారు కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్, వివేకా హత్య సమయంలో నిఘా అధిపతిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాయడం కలకలం రేపుతోంది.
నత్తనడకన వివేకా హత్య కేసు
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్, సీఐడీ, సీబీఐ ఇప్పటివరకూ ఎలా్ంటి పురోగతి సాధించినట్లు కనిపించడం లేదు. తొలుత తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ హత్యపై టీడీపీ సిట్, సీఐడీ దర్యాప్తు చేయించగా.. ఆ తర్వాత వివేకా కుమార్తె విజ్ఞప్తితో హైకోర్టు సీబీఐకి ఈ కేసు అప్పగించింది.
అయినా ఏడాదిన్నరగా ఎలాంటి పురోగతి ఉన్నట్లు కనిపించడం లేదు. కరోనా సమయంలో పులివెందుల వచ్చి దర్యాప్తు చేసి వెళ్లిన సీబీఐ ఆ తర్వాత దీని పురోగతిపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇప్పటికీ అధే పరిస్దితి. దీంతో తాజాగా తిరుపతి ఉపఎన్నికలోనూ ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది.
ఆధారాలు ఇస్తానన్న ఏబీ వెంకటేశ్వరరావు
మాజీ ఎంపీ, మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావాల్సిన కేసుల్లో దూకుడుగా దర్యాప్తు చేసే సీబీఐ.. ఇంత సంచలన కేసులో మాత్రం దర్యాప్తును నత్తనడక సాగించడంపై సాధారణ ప్రజల నుంచి సైతం విమర్శలు వినిపిస్తున్నాయి.
అటు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన వద్ద ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయంటూ గతేడాది సీబీఐ డైరెక్టర్కు ఫోన్లో తెలిపినా పట్టించుకోలేదు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణపై రెండుసార్లు సీబీఐని సంప్రదించిన ఏబీ తాజాగా మరో లేఖ రాశారు.
సీబీఐకి లేఖలో ఏబీ సంచలన ఆరోపణలు
అయితే వివేకా హత్య జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఛీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఈ కేసులో కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఏడాది క్రితమే రెండుసార్లు సీబీఐని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో మూడు రోజుల క్రితం మరోసారి లేఖ రాశారు. ఆ హత్య జరిగినప్పుడు అక్కడ ముందుగా వెళ్లిన వారిలో ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ కూడా ఉన్నారని, ఆయన్ను వైఎస్ కుటుంబ సభ్యులు లోనికి రానివ్వలేదని ఆరోపించారు.
ఆ తర్వాత ఆస్పత్రికి తరలించాలని చెప్పుకొచ్చారు. దీనికి సంబందించి తన వద్ద నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు అధికారపార్టీ ఎంపీ ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు.
డీజీ ర్యాంకు అధికారి చెప్పినా పట్టించుకోరా?
ఏపీతో పాటు దేశంలో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు సీబీఐకి ఇచ్చేందుకు సిద్దమని ఏబీ తెలిపారు. డీజీ ర్యాంకు అధికారిగా, ఈ హత్య జరిగినప్పుడు ఇంటిలిజెన్స్ ఛీఫ్గా ఉన్న తాను ఆధారాలు ఇస్తానంటే ఇప్పటివరకూ తీసుకోకపోవడంపైనా ఏబీ వెంకటేశ్వరరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న టీమ్కు ఆధారాలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్ను ఏబీ కోరారు. ప్రస్తుతం ఏపీ ఇంటిలిజెన్స్ కార్యాలయంలోనూ ఆధారాలు ఉన్నాయని, అక్కడ కూడా తీసుకోవచ్చని ఆయన సూచించారు.