ఏపీ సర్కారు కీలక నిర్ణయం: టీడీపీ ప్రభుత్వ అవినీతిపై సిట్, ప్రత్యేక అధికారాలు
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఆర్డీఏ అవినీతి అక్రమాలపై సిట్..
గతంలో మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై సిట్ విచారణ చేపట్టనుంది. సీఆర్డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టనుంది.సీఆర్డీఏతోపాటు ఇతర ప్రాజెక్టులోని అక్రమాలపైనా సిట్ విచారణ చేపట్టనుంది.
ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం..
ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్ రెడ్డి, జయరామ్ రాజు, విజయ్ భాస్కర్, గిరిధర్, కెనడీ, శ్రీనివాసన్, ఎస్వీ రాజశేఖర్ రెడ్డిలను నియమించింది. సిట్కు ప్రభుత్వం విస్తృత అధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్ కు ఉందంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ, దర్యాప్తు కోసం వేర్వేరుగా సిట్స్ ఏర్పాటు చేసింది.
భూముల ఆక్రమణాలపై..
అమరావతిలో చోటుచేసుకున్న ఇన్ సైడర్ ట్రేడింగ్, భూముల లావాదేవీలపై కూడా విచారించనుంది. అలాగే గత ప్రభుత్వంలో రాజకీయ పార్టీల నేతలు ఆక్రమించిన భూములను రాజధాని పరిధిలోకి తెస్తూ చేసిన అక్రమాలపై కూడా సిట్ విచారించనుంది.
స్పీకర్ ఆదేశాల నేపథ్యంలో..
అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారు కూడా సిట్కు కట్టబెట్టింది ప్రభుత్వం. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రాజధాని భూముల అవకతవకలపై విచారణ చేపట్టాలని అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.