మాజీ సైనికులకు చంద్రబాబు గుడ్ న్యూస్-ఏకంగా రూ.10 కోట్లతో..!
ఏపీలో మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి కోసం ఓ ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసింది. దీనికి రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ను కూడా కేటాయించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఊరట లభించనుంది.
సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి, అలాగే కుటుంబ సభ్యుల్ని సైన్యంలో కోల్పోయి వితంతువులుగా మిగిలిన వారికి, అలాగే వారిపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం ఎక్స్ సర్వీస్ మెన్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఆరంభ కార్పస్ గా రూ.10 కోట్ల నిధుల్ని కేటాయించింది. అలాగే అవసరాన్ని బట్టి మరింత మొత్తం కేటాయించేందుకు సిద్దమని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

హోంశాఖ ఆదేశాల మేరకు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ మాజీ సైనికుల కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తారు. ఈ కార్పోరేషన్ ఎలా పనిచేస్తుంది, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు, వారిపై ఆధారపడిన వారికి ఏ విధంగా సాయం అందిస్తుందన్న దానిపై ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా మాజీ సైనికులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications