ఏపీలో స్కూళ్లకు సెలవులు
రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్ర రూపాన్ని సంతరించుకుంది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో జోరుగా వానలు కురుస్తున్నాయి. పూరీ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడులతో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రంగంలోకి దిగిన విపత్తుల నిర్వహణ సంస్థ
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతోపాటు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావంతో కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల కోసం బృందాలను రాష్ట్ర విపత్తులు, నిర్వహణ సంస్థ రంగంలోకి దింపింది.

పొంగుతున్న వాగులు, వంకలు
లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తుండటంతో ప్రజలెవరూ కాల్వలు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచించారు. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులు నివేదికలు తెప్పించుకుంటూ స్థానిక అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధవళేశ్వరం బ్యారేజిలోకి వరదనీరు భారీగా చేరుతోంది. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.












Click it and Unblock the Notifications