సచివాలయంలో ఉద్యోగుల భేటీకి అనుమతి నిరాకరణ- ఏపీఎన్జీవో ఆఫీసులోనే మీటింగ్
ఏపీలో పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీలు ఏకమయ్యాయి. నాలుగు జేఏసీలు కలిసి ఇవాళ ఉమ్మడిగా సచివాలయంలోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో భేటీ కావాలని నిర్ణయించాయి. ఇవాళ కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే చివరి నిమిషంలో వారి భేటీకి బ్రేక్ పడింది.
ఇవాళ కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలో ఉద్యోగుల భేటీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వం భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించింది. కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో ఉద్యోగులు భేటీ అయితే పరిస్దితులు అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయని భావించిన ప్రభుత్వం ఈ భేటీకి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దీంతో ఉద్యోగులు ప్లాన్ మార్చుకున్నారు.
సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల భేటీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో విజయవాడలోని ఏపీఎన్జీవో భవన్ లో భేటీ కావాలని ఉద్యోగులు నిర్ణయించారు. కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసే అవకాశముంది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమై ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమ్మెపైనా ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీల నేతలు భావిస్తున్నారు. ఆ తర్వాత సీఎస్ ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటన్నారు.