ఏపీలో నైట్ కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు..: డీటెయిల్స్ ఇవే: ఐపీసీ సెక్షన్ 188
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్.. రాష్ట్రంలో అదుపులోనే ఉంటోంది. ఇదివరకట్లా వేల సంఖ్యలో రోజువారీ కొత్త కేసులేవీ నమోదు కావట్లేదు. కరోనా వల్ల సంభవిస్తోన్న మరణాల సంఖ్య కూడా నియంత్రణలోనే ఉంటోంది గానీ పూర్తిగా తగ్గట్లేదు. రోజూ వేల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతోన్న సమయంలోనూ ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ వైపు మొగ్గు చూపలేదు. కఠిన ఆంక్షలను విధిస్తూ వచ్చింది. పగటి పూట కూడా కర్ఫ్యూను అమలు చేసింది.
నిర్ణీత సమయం మేరకు మాత్రమే దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలను తెరచుకోవడానికి అవకాశం ఇచ్చింది. నైట్ కర్ఫ్యూను అమలు చేసింది. కరోనా వైరస్ రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న కొద్దీ.. ఆంక్షలను సడిలించింది. పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. నైట్ కర్ఫ్యూను మాత్రం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఇప్పుడు కూడా ఏపీలో కొనసాగుతోంది.
రాత్రి 10 గంటల తరువాత దుకాణాలను తెరచి ఉంచడానికి పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. వాహనాల రాకపోకలపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ- దుకాణ సముదాయాలను తెరచి ఉంచడంపై ఆంక్షలు కొనసాగిస్తోంది. తాజాగా ఈ నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఏపీ ప్రభుత్వం. మరో వారం రోజుల పాటు అంటే- ఈ నెల 21వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు పొడిగించిన నైట్ కర్ఫ్యూ శనివారం రాత్రితో ముగిసింది.

దీనితో- దాన్ని మరిన్ని రోజులు పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్లు 51 నుంచి 60, ఐపీసీలోని సెక్షన్ 188 కింద కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 21వ తేదీన గడువు ముగిసిన తరువాత.. అప్పటి పరిస్థితులను సమీక్షించిన అనంతరం నైట్ కర్ఫ్యూను కొనసాగించాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం.
Recommended Video
కాగా- రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా 1535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 299 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 19,92,191కి చేరుకున్నాయి. ఇందులో 19,60,350 మంది డిశ్చార్జ్ అయ్యారు. 13,631 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 18,210గా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications